భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య | Triple Murder In Kolkata: Man Says He Killed Wife After She Attacked 2 Sons | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య

Jan 16 2016 3:36 PM | Updated on Sep 3 2017 3:45 PM

భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య

భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య

భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ టీనేజ్లో ఉన్న వారి ఇద్దరు పిల్లల హత్యకు దారితీసింది.

కోల్కతా(పశ్చిమబెంగాల్): భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ టీనేజ్లో ఉన్న వారి ఇద్దరు పిల్లల హత్యకు దారితీసింది. ఈ గొడవలో భార్య కూడా మృతి చెందగా భర్త కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన శనివారం ఉదయం దక్షిణ కోల్కతాలోని పామ్ అవెన్యూ సమీపంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నీల్ ఫాన్సెకా (49) తన భార్య జెస్సికా, టీనేజ్ లో ఉన్న తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసి సరదాగా గడిపి తిరిగి ఇంటికి వెళ్లారు. అయితే వారి మధ్య ఏ విషయంలో విబేధాలు ఎందుకు తలెత్తాయోగానీ భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కాగా శనివారం ఉదయం భర్త నీల్ స్నానం చేసి గదిలోకి వచ్చేసరికి జెస్సికా తమ కవల పిల్లలైన తారెన్, జాషువాల గొంతులు కోసింది. బెడ్పై కుమారులిద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాన్ని చూసిన నీల్ వెంటనే మరో పదునైన ఆయుధంతో భార్యపై విరుచుకుపడ్డాడు. ఈ హోరాహోరీలో భార్య మృతిచెందగా భర్త తీవ్రగాయాలపాలై అచేతనస్థితిలో పడిపోయాడు. 8వ తరగతి చదువుతున్న ఆ కవల సోదరులు కూడా మృతిచెందారు.

తల్లి, కుమారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నీల్ ను ఆస్పత్రికి తరలించారు. కాగా వీరి కుమార్తె సమంత తన గదిలోనే నిద్రపోతుండటంతో ఆమెకు వీరి అరుపులేమీ వినిపించలేదని పోలీసులకు తెలిపింది. నీల్ కుటుంబం ఎంతకీ ఫోన్ తీయడంలేదంటూ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం వారి ఇంటికి వెళ్లడంతో హత్యల సంగతి వెలుగుచూసింది. నీల్ వాంగూల్మం తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement