సుప్రీం జడ్జీలకు జస్టిస్‌ రమణ విందు | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జీలకు జస్టిస్‌ రమణ విందు

Published Thu, Jan 18 2018 2:00 AM

 Thaw begins? CJI, senior judges have a lunch date on Wednesday - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. సుప్రీం కోర్టు జడ్జీల కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. కోర్టు ప్రాంగణంలోని ఆయన చాంబర్‌లో భోజన విరామ సమయంలో జరిగిన విందులో నోరూరించే ఆంధ్రా వంటకాలను వడ్డించారు. తాజాగా నెలకొన్న సుప్రీం సంక్షోభంతో కోర్టు వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన ఈ విందు ఉపశమనం లాంటిదని ఓ సీనియర్‌ జడ్జి పేర్కొన్నారు.

అనారోగ్యం కారణంగా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ గోయల్‌ మినహా సీజేఐ దీపక్‌ మిశ్రా, మిగిలిన 23 మంది న్యాయమూర్తులు ఈ విందులో పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఒక్కో జడ్జి తమ ప్రాంత వంటకాలతో జడ్జీల కోసం విందు ఇస్తున్నారు. కాగా, బుధవారం కోర్టు కార్యకలాపాల ప్రారంభానికి ముందే జస్టిస్‌ చలమేశ్వర్‌ మినహా మిగిలిన ముగ్గురు తిరుగుబాటు జడ్జీలతో సీజేఐ సమావేశమయ్యారు. గురువారం చలమేశ్వర్‌ కోర్టుకు హాజరయ్యే అవకాశముంది. దీంతో ఈ నలుగురితో సీజేఐ సమావేశం అవుతారని సమాచారం.

Advertisement
Advertisement