బోరుబావిలోనే బాలుడు | Tamil Nadu toddler remains stuck in borewell on Day 4 | Sakshi
Sakshi News home page

బోరుబావిలోనే బాలుడు

Oct 29 2019 2:22 AM | Updated on Oct 29 2019 2:22 AM

Tamil Nadu toddler remains stuck in borewell on Day 4 - Sakshi

బావిలో బాలుడి తాజా చిత్రం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్‌ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్‌ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్‌ మెషీన్‌ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.  కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్‌ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్‌ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే.  ‘సుజిత్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement