ఎలక్టోరల్ బాండ్స్.. కేంద్రానికి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల అంశంలో కేంద్రానికి ఝలక్ తగిలింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్నికల బాండ్ల విధానంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సీపీఎం నేత సీతారాం ఏచూరి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది ఆచరణ సాధ్యమయ్యే విషయమేనా? అని ప్రశ్నిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఎలక్టోరల్ బాండ్లు... ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. కోట్ల కొద్దీ డబ్బును విరాళాలను పార్టీలు జమ చేసుకుంటాయి. వాటికి లెక్కాపత్రం ఏమీ ఉండవు. చిన్నా చితకా పార్టీలు కూడా ఇందుకు అతీతం కాకపోవటంతో.. ఈ చర్యలకు ఫుల్స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం ఆయా పార్టీలకు విరాళాలు ఇవ్వదల్చిన దాతలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వాలి.
ఇందుకోసం ఎస్బీఐ ద్వారా బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వెయ్యి నుంచి కోటి రూపాయల దాకా వివిధ పరిమాణాల్లో ఉండే ఈసీకి సమర్పించిన అకౌంట్ ద్వారానే రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటాయి. రాజకీయ పార్టీల నిధుల సేకరణ కింద ఏ పార్టీ విరాళాల రూపంలో ఎంత వెనకేసుకున్నాయో ఈసీ రిటర్న్స్లో నమోదవుతుంది.