వ్యభిచారం చేయనని ఎదిరించిన మహిళపై సదరు వ్యభిచార కూపానికి నేతృత్వం వహిస్తున్న మరో మహిళ ఆధ్వర్యంలో పాశవిక దాడి జరిగింది
మహారాష్ట్రలో వ్యభిచారం చేయనన్న మహిళపై అకృత్యం
థానే: వ్యభిచారం చేయనని ఎదిరించిన మహిళపై సదరు వ్యభిచార కూపానికి నేతృత్వం వహిస్తున్న మరో మహిళ ఆధ్వర్యంలో పాశవిక దాడి జరిగింది. బాధితురాలి రొమ్ములు కోసేసి, పళ్లను రాలగొట్టారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ నగరంలో ఈ నెల 19న జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్కు చెందిన 24 ఏళ్ల యువతి పొట్టచేతబట్టుకుని భివాండీ నగరానికి వచ్చింది. మాయ మాటలతో కొందరు ఆమెను వ్యభిచార కూపానికి అమ్మేశారు. ఈ క్రమంలో వ్యభిచార కూపానికి నేతృత్వం వహిస్తున్న రూబీ(34) సదరు యువతిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి ఆమె తిరస్కరించి ఎదరుతిరిగింది. దీంతో రూబీ మరో ఇద్దరు నిందితులు ఆలాం, అఫ్రాజ్లతో కలసి బాధితురాలి రొమ్ములు కోసి, పళ్లు ఊడేలా ముఖంపై బలమైన దెబ్బలు వేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కొందరు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని శనివారం అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో ఘటనలో థానే జిల్లాలోని అభిత్గఢ్లో స్నేహితుణ్ని చూసేందుకు అతని ఇంటికి వెళ్లిన లఖన్ యాదవ్ అనే వ్యక్తి సదరు స్నేహితుడు ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్యపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.