రండి.. దీపాలు వెలిగిద్దాం | PM Narendra Modi tweets Vajpayee is poem Aao Diya Jalaye | Sakshi
Sakshi News home page

రండి.. దీపాలు వెలిగిద్దాం

Apr 5 2020 4:26 AM | Updated on Apr 5 2020 12:31 PM

PM Narendra Modi tweets Vajpayee is poem Aao Diya Jalaye - Sakshi

ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు.   

వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి
కరోనా వైరస్‌ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్‌ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్‌ కేర్‌ ట్రైనింగ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.  

కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం
ఫోన్‌లో ట్రంప్‌–మోదీ సంభాషణ
ప్రాణాంతక కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. వారిద్దరూ శనివారం ఫోన్‌ ద్వారా పరస్పరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్‌–అమెరికా భాగస్వామ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై తమ మధ్య విస్తృతమైన చర్చ జరిగిందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement