ఇంధన భారాలపై సీఈవోలతో ప్రధాని భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఇంధన భారాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ చమరు, గ్యాస్ కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు, ముడిచమురు ధరల సెగలు వృద్ధికి ఆటంకంగా మారిన క్రమంలో ప్రధాని మోదీ ఈ సమావేశంలో ఇంధన పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సౌదీ చమురు మంత్రి ఖలీద్ ఫలీ, బీపీ సీఈవో బాబ్ దుడ్లీ, టోటల్ హెడ్ ప్యాట్రిక్ ఫుయానే, రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ, వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.
కాగా చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడుల పునరుద్ధరణపై కూడా ప్రధాని గ్లోబల్ సీఈవోలతో చర్చిస్తారని అధికార వర్గలు పేర్కొన్నాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన సమావేశంలో చమురు తయారీతో పాటు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్కు చెందిన చమురు, గ్యాస్ క్షేత్రాల్లో చమురు ఉత్పాదనలో విదేశీ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని సలహాలు రాగా ఆయా ప్రభుత్వ రంగ సంస్ధల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదు.