జీఎస్‌టీ.. మళ్లీ మొదటికి?! | opposition parties opposes GST bill in Parliament | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ.. మళ్లీ మొదటికి?!

May 6 2015 1:46 AM | Updated on Sep 3 2017 1:29 AM

జీఎస్‌టీ.. మళ్లీ మొదటికి?!

జీఎస్‌టీ.. మళ్లీ మొదటికి?!

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఎట్టకేలకు మంగళవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. యూపీఏ తెచ్చిన జీఎస్‌టీ బిల్లులో మార్పులు చేసినందున తాజా బిల్లును మళ్లీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. స్పీకర్ నిరాకరించారు.

- బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని లోక్‌సభలో ప్రతిపక్షాల పట్టు
- స్పీకర్ తిరస్కరణ.. జీఎస్‌టీ బిల్లుపై లోక్‌సభలో చర్చ షురూ
- స్థాయీ సంఘానికి పంపితే మరో ఏడాది అలస్యమవుతుంది: జైట్లీ
- బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్.. వ్యతిరేకించిన అన్నాడీఎంకే

న్యూఢిల్లీ:
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఎట్టకేలకు మంగళవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. యూపీఏ తెచ్చిన జీఎస్‌టీ బిల్లులో మార్పులు చేసినందున తాజా బిల్లును మళ్లీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయగా..  స్పీకర్ నిరాకరించారు. అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తితో ఎట్టకేలకు సభలో బిల్లుపై చర్చచేపట్టారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వం.. ఈ సభలో బిల్లును ఆమోదించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ.. రాజ్యసభలో ఆధిక్యం లేకపోవటంతో అక్కడ బిల్లు పరిస్థితి ఏమవుతుంది, మళ్లీ మొదటికి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

అంతకుముందు.. ప్రభుత్వం పలు బిల్లులను పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపించకుండా పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్, బీజేడీ, అన్నాడీఎంకే, సీపీఎం ధ్వజమెత్తాయి.  ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన 51 బిల్లుల్లో 44 బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించటం కోసం స్థాయీ సంఘాలకు పంపించలేదని మహతాబ్(బీజేడీ) విమర్శించారు.  ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ల పాలన ద్వారా సభావ్యవహారాల నిబంధనలను అతిక్రమిస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే   దుయ్యబట్టారు. జీఎస్‌టీ బిల్లును స్థాయీ సంఘానికి పంపించినట్లయితే మరొక ఆర్థిక సంవత్సరం పాటు రాష్ట్రాలకు ప్రయోజనాలు దక్కవని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి అమలులోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరదని జైట్లీ అన్నారు.

స్థాయీ సంఘం జీఎస్‌టీపై ఇప్పటికే రెండున్నరేళ్లు అధ్యయనం చేసిందని.. కొన్ని అంశాలు మినహా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీలో విస్తృత ఏకాభిప్రాయమూ వ్యక్తమయిందని చెప్పారు.  ఈ కీలక బిల్లు ఆమోదంలో జాప్యం వల్ల  ఎలాంటి ప్రయోజనమూ ఉండదని.. పార్టీలు విభేదాలకు అతీతంగా ముందుకు రావాలని  కోరారు. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై మాట్లాడుతూ.. దేశంలో పన్ను విధానాన్ని మార్చి కొత్తగా జీఎస్‌టీని అమలు లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ 122వ రాజ్యాంగ సవరణ బిల్లును స్థాయీ సంఘానికి పంపించాలని మహతాబ్(బీజేడీ).. స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారని, అయితే అలా పంపించరాదని జైట్లీ స్పీకర్‌ను కోరారని.. జైట్లీ విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారన్నారు.

అనంతరం బిల్లుపై చర్చ చేపట్టగా.. కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ చర్చను ప్రారంభిస్తూ.. బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం స్థాయీ సంఘానికి పింపించాలని పునరుద్ఘాటించారు. బిల్లుకు మద్దతు ప్రకటించిన టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు.. అప్పిలేట్ అథారిటీ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు.  జీఎస్‌టీ వల్ల పంపిణీ వరుసక్రమం బలపడుతుందని టీఆర్‌ఎస్ సభ్యుడు కె.వి.రెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లుక మద్దతు ఇస్తున్నామని టీఎంసీ పేర్కొంది.  బిల్లు తమిళనాడుకు చేటు చేస్తాయని.. కాబట్టి వ్యతిరేకిస్తున్నామని అన్నాడీఎంకే సభ్యుడు పి.వేణుగోపాల్ చెప్పారు. సీపీఎం సభ్యుడు పి.కరుణాకరన్ దాన్ని స్థాయీ సంఘానికి పంపాలన్నారు.

 
జీఎస్‌టీ అసలు లక్ష్యం నెరవేరుతుందా? లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి ప్రశ్న  వినియోగదారులపై పన్ను భారం తగ్గించాలన్న అసలు ఉద్దేశం జీఎస్‌టీ పన్ను రేటుతో నెరవేరుతుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు ప్రశ్నించారు.


జలమార్గాల బిల్లు...
కేంద్రం జాతీయ జలమార్గాల బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రోడ్లపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు, చౌక రవాణా మార్గాలను అందించేందుకు  ప్రస్తుతమున్న ఐదు జలమార్గాలకు కొత్తగా 101 జలమార్గాలను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఈ బిల్లును నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రోడ్డు రవాణా ధర కి.మీకి రూ. 1.50గా, రైలు రవాణా ధర రూ. 1గా ఉందని.. జల రవాణా ధర 50 పైసలే ఉంటుందని పేర్కొన్నారు.


రాజ్యసభలో జీఎస్‌టీకి అవరోధం?!
జీఎస్‌టీ బిల్లును పరిశీలన కోసం స్థాయీ సంఘానికి పంపించాలని విపక్షాలు పట్టుపడుతున్న నే పథ్యంలో.. ఈ అంశంపై అధికార - విపక్షాలకు మధ్య ఘర్షణ తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో బిల్లుకు ఆమోదానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లోని ఎన్‌డీఏ మిత్రపక్షాల సభాపక్షాల నేతలతో సమావేశమయ్యారు.

బిల్లు సాఫీగా ఆమోదం పొందేందుకు ఆయా పక్షాల సభ్యులందరూ బుధవారం సభలో ఉండేలా చూడాలని కోరారు. శివసేన, టీడీపీ, ఎల్‌జేపీ, ఎస్‌ఏడీ, ఎన్‌పీపీ, ఎస్‌డీఎఫ్, ఆర్‌పీఐ తదితర పక్షాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఒకవేళ  మిత్రపక్షాలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో లోక్‌సభలో బిల్లును గట్టెక్కించినప్పటికీ రాజ్యసభలో ఇబ్బందులు తప్పేలా లేవు.

స్థిరాస్తి బిల్లు సెలక్ట్ కమిటీకి..
వివాదాస్పద స్థిరాస్తి బిల్లును పార్లమెంటరీ ఎంపిక కమిటీకి పంపించాలని రాజ్యసభలో విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేయడంతో ప్రభుత్వం అందుకు సమ్మతించింది. 21 మంది సభ్యులతో కూడిన ఎంపిక కమిటీకి బిల్లును సిఫార్సు చేయనుంది. ఈమేరకు మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ సీఎం రమేశ్ ఈ కమిటీలో ఉన్నారు. కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల తొలి వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరనుంది.

స్థిరాస్తి వ్యాపారాన్ని నియంత్రించేందుకు కేంద్రం తీసుకువచ్చిన స్థిరాస్తి(సవరణ) బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ.. ప్రభుత్వం మైనారిటీలో ఉన్న రాజ్యసభలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో చర్చకు పెట్టాల్సి ఉండగా.. విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.  గత నెల 26వ తేదీన కూడా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించగా.. దానిని ముందు ఎంపిక కమిటీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టటంతో అప్పుడూ బిల్లును వాయిదా వేయాల్సి వచ్చింది.

మోగా ఘటనపై ఉభయసభలు వాయిదా
పంజాబ్‌లోని మోగాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఆమె మృతి ఘటన మంగళవారం పార్లమెంట్ ఉభయసభలను కాసేపు స్తంభింపచేసింది. ఈ ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయగా.. ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తి పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మొదలవగానే. కాంగ్రెస్ నేత అంబికాసోనీ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు మృగ్యమయ్యాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఘటన జరిగిన బస్సు యజమానులు రాష్ట్ర పాలకులని, ఇది తీవ్రమైన అంశమని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.

చర్చ జరగాలంటే నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. లోక్‌సభలో అమరీందర్‌సింగ్(కాంగ్రెస్) మాట్లాడుతూ ఆర్బిట్ బస్సుల్లో ఇటువంటి ఘటనలు జరగటం ఇదే తొలిసారి కాదన్నారు. అకాలీదళ్ సభ్యులు నిరసన తెలపడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగటంతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది.


మంగళవారం పార్లమెంటులో చర్చకు వచ్చిన మరికొన్ని అంశాలు

- నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై దర్యాపు జరిపించాలని ప్రభుత్వం యోచించడం లేదని హరిభాయ్ చౌధురి లోక్‌సభకు వెల్లడించారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్‌ల ఏర్పాటు ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. దీంతో ఈ టౌన్‌షిప్‌లపై రగులుతున్న వివాదానికి తెరపడినట్లయింది.


- దేశంలో స్మగ్లింగ్ అవుతున్న వాటిలో గంధపు చెక్కలు, ఎర్రచందనం వాటానే ఎక్కువని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభకు తెలిపారు. ఈ చెట్ల వివరాలను రాష్ట్రాల వారీగా ప్రభుత్వం సేకరించనుందన్నారు.

- మరిన్ని ఔషధాలను ధరల నియంత్రణలోకి తేవడానికి జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, దీని కోసం కమిటీని నియమించామని ఎరువులు, రసాయనాల మంత్రి అనంత్‌కుమార్ లోక్‌సభకు తెలిపారు.

- స్విట్జర్లాండ్, బ్రిటన్, స్పెయిన్ ప్రభుత్వాలు నల్లధన ఖాతాలకు సంబంధించి భారత్‌కు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే భారత్‌తో పన్ను సమాచార ఒప్పందం కుదర్చుకున్న దేశాలు నిర్దిష్ట కేసుల్లో అవసరమైన సమాచారం ఇచ్చాయని వెల్లడించారు.

- ఎలాంటి వివక్షా లేకుండా పౌరలందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటామని ఐటీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఇంటర్నెట్ సమానత్వంపై సావధాన తీర్మానానికి ఆయన సమాధానమిచ్చారు. ఇంటర్నెట్ సమానత్వం ఉండాలని సభ్యులు పార్టీలకతీతంగా కోరారు. ఈ అంశంపై ‘ట్రాయ్’ సంప్రదింపుల పత్రానికి సంబంధించి సూచనలు ఇచ్చిన పది లక్షల మంది మెయిల్ ఐడీలను ఆ సంస్థ బయటపెట్టడాన్ని తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement