అందరివాడు అటల్ | Nitish Kumar brings resolution to greet Atal Bihari Vajpayee for Bharat Ratna | Sakshi
Sakshi News home page

అందరివాడు అటల్

Dec 25 2014 3:51 AM | Updated on Sep 2 2017 6:41 PM

అందరివాడు అటల్

అందరివాడు అటల్

దేశంలో అత్యంత ఆకర్షణ ఉన్న నేతల్లో ఒకరైన వాజ్‌పేయి అజాత శత్రువుగా పేరు పొందారు. బీజేపీలోనేగాక పార్టీలకు అతీతంగా కూడా అందరి ఆమోదం పొందిన నేతగా గుర్తింపు పొందారు.

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఆకర్షణ ఉన్న నేతల్లో ఒకరైన వాజ్‌పేయి అజాత శత్రువుగా పేరు పొందారు. బీజేపీలోనేగాక పార్టీలకు అతీతంగా కూడా అందరి ఆమోదం పొందిన నేతగా గుర్తింపు పొందారు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో వాజ్‌పేయి జన్మించారు. ఆయన పూర్తిపేరు అటల్ బిహారీ వాజ్‌పేయి. కృష్ణబిహారీ వాజ్‌పేయి, కృష్ణాదేవి ఆయన తల్లిదండ్రులు. ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన వాజ్‌పేయి బ్రహ్మచారి. మచ్చలేని నేతగా పేరుపొందిన వాజ్‌పేయి.. మంచి వక్త. కవి కూడా.
 
 1942-45 మధ్య క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి జైలుకెళ్లారు. తొలుత కమ్యూనిస్టుగా రాజకీయాల్లోకి ప్రవేశించినా... ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రికను నడపడానికి 1950వ దశకంలో తన న్యాయవాద చదువును వదిలేశారు. బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీకి సన్నిహిత అనుచరుడిగా మారారు. 1957లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలతో జనసంఘ్‌లో మితవాద నేతగా ఎదిగారు. 1980లో బీజేపీ ఏర్పాటు అనంతరం ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగానూ కొనసాగారు.
 
 బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 90వ దశకంలో బీజేపీతో కలసి నడవడంపై ఊగిసలాటతో ఉన్న మిత్రపక్షాలు... వాజ్‌పేయి చరిష్మాతో ఆ పార్టీ వైపు మొగ్గాయి. దీంతో తొలిసారిగా కేంద్రంలో తొలిసారి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. అది కొద్దికాలమే నిలిచినా... ఆ తర్వాత వాజ్‌పేయి నాయకత్వమే బీజేపీకి మార్గనిర్దేశనం చేసింది. ఎక్కువకాలం ప్రధానిగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా వాజ్‌పేయి రికార్డు నెలకొల్పారు. బీజేపీకి జాతీయవాద పార్టీగా మరింత గుర్తింపు తేవడంలో వాజ్‌పేయి కృషి అనన్య సామాన్యం. ఆయన హయాంలో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతో మెరుగయ్యాయి. 1999లో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు సరిహద్దుల నుంచి బస్సులో వెళ్లడం చరిత్ర సృష్టించింది కూడా. అంతేకాదు ఎల్‌కే అద్వానీ సహా బీజేపీ నేతలంతా బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించినా... దానిని వాజ్‌పేయి బహిరంగంగా, స్పష్టంగా ఖండించడం గమనార్హం.
 
 -    1996లో బీజేపీ ఆధ్వర్యంలోని తొలి సంకీర్ణ ప్రభుత్వానికి వాజ్‌పేయి నేతృత్వం వహించారు. అయితే ప్రభుత్వం పడిపోవడంతో ప్రధానిగా 13 రోజులే కొనసాగారు.
 -    1998లో ఆయన ఆధ్వర్యంలో రెండో సారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కూడా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే అధికారం కోల్పోయారు. అయితే పదవిలో ఉన్న ఈ కొద్దికాలంలోనే భారత్ ఎన్నో ఘనతలను నమోదు చేసింది. అమెరికా సహా ప్రపంచదేశాల హెచ్చరికలు చేసినా.. 1998 మేలో పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి మన సత్తాను ప్రపంచానికి చాటారు.
 -    ఇక 1999లో మూడో సారి ఎన్డీఏ నేతృత్వంలోని సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా.. అప్పటి నుంచి 2004 వరకు వాజ్‌పేయి ప్రధానిగా కొనసాగారు. ఈ సమయంలోనే 2001లో అప్పటి పాకిస్థాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా సదస్సు నిర్వహించారు. వాజ్‌పేయి వ్యక్తిత్వంపై ఎలాంటి సందేహం లేకున్నా... ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆయుధాల కుంభకోణం వెలుగులోకి వచ్చి బీజేపీకి పెద్ద దెబ్బ తగిలింది.
 
 ఐదేళ్లుగా మౌనమే..!
 సాక్షి, న్యూఢిల్లీ: గొప్ప వక్తగా పేరున్న వాజ్‌పేయి గొంతు అనారోగ్యంతో మూగవోయింది. 2009 నాటి స్ట్రోక్ కారణంగా మాట్లాడలేకపోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గుదల, దీర్ఘకాలిక మధుమేహ వ్యాధితో  బాధపడుతున్నట్టు సన్నిహితులంటున్నారు.  నేడు 90వ వసంతంలోకి అడుగుపెడుతున్న వాజ్‌పేయి వృద్ధాప్య రుగ్మతలతో బాధపడుతున్నారు. ‘కొన్నిసార్లు వారు మనుషులను గుర్తుపట్టినట్టు కనిపించినా వారు మాట్లాడలేకపోతున్నారు..’ అని సన్నిహితులు చెబుతుంటారు. చెకప్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి మినహా బయటకు వెళ్లిన ఉదంతాలు లేవు. 2007లో చివరిసారిగా ఆయన ల క్నోలో బహిరంగ సభలో మాట్లాడారు. వాజ్‌పేయి బాగోగులను దత్తపుత్రిక నమిత చూసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement