లోక్సభ ఈ నెల 12వ తేదీ సోమవారానికి వాయిదాపడింది.
న్యూఢిల్లీ: లోక్సభను ఈ నెల 12వ తేదీ సోమవారం వరకు వాయిదావేశారు. సభలో ఈరోజు పలు అంశాలను చర్చించారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దులలో భారత సైనికులపై కాల్పులు జరిగిన సంఘటన, సైనికుల మృతి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై చర్చించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే రాష్ట్రాన్ని విభజించవద్దని తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఆ తరువాత పాకిస్తాన్ చొరబాటుయత్నంపై రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోనీ లోక్సభలో వివరణ ఇచ్చారు. మొన్న పాకిస్తాన్ హస్తం లేదన్న ఆయన విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మాట మార్చారు. భారతీయ జవాన్లపై దాడికి పాకిస్తాన్దే పూర్తి బాధ్యత అని ప్రకటన చేశారు. పాక్ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. జవాన్లపై దాడి ఘటనలో పాక్ బలగాలు పాల్గొన్నాయన్నారు. పూంచ్ సెక్టార్లో ఆర్మీ చీఫ్ పర్యటించారని ఆయన తెలిపారు. మొన్న తనవద్ద ఉన్న సమాచారంతో ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్ల మరణంపై రక్షణ మంత్రి ఆంటోని ప్రకటన చేయాలని విపక్షాలు బుధవారం పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోని సభకు వివరించారు. దాంతో మంత్రి ప్రకటనతో విపక్షాలు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రక్షణ మంత్రి ఆంటోని పాకిస్థాన్కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆందోళనబాట పట్టాయి. ఆంటోనీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో ఈ ఘటనపై ఆంటోని తాజా ప్రకటన చేశారు.
సరిహద్దులలో కాల్పుల అంశంపై కొందరు సభ్యులు మాట్లాడాలని కోరినప్పటికీ, స్పీకర్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. ఈద్ సందర్భంగా శుక్రవారం సెలవు అయినందున సోమవారం వరకు వాయిదా వేశారు.