రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఐఐటీ-ఢిల్లీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహారయాత్రకు జైసల్మేర్ వెళ్లారు.
నలుగురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల దుర్మరణం
జెసల్మేర్: రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఐఐటీ-ఢిల్లీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహారయాత్రకు జైసల్మేర్ వెళ్లారు. ఆదివారం ఉదయం వీరంతా జైసల్మేర్ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. జైసల్మేర్ నుంచి ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.
దీంతో వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయిన నలుగురిని దీక్షా గౌతమ్, పల్లవ్ అగర్వాల్, అర్చనా కుమారి, మయాంక్ గోయల్గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులు స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.