సీఏఏ నిరసనలు: పోలీసుల కాల్పులు
కాన్పూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఇప్పటికీ చల్లారలేదు. పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి పోలీసులు కారణం కాదని, పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపలేదని పోలీసు ఉన్నతాధికారులు ఒకటికి పదిమార్లు చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు యథేచ్ఛగా కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో 15 మంది చనిపోగా పలువురు బుల్లెట్ల దాడిలో గాయాలతో బయటపడ్డారు. అయితే తాము ఎలాంటి కాల్పులు జరపలేదని పోలీసులు ప్రకటించారు.
యూపీ పోలీసు ఉన్నతాధికారులు సైతం.. నిరసనకారులే కొంతమంది తుపాకీలు వినియోగించారని, ఇప్పటివరకు 400కు పైగా ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కానీ తాజా వీడియోలో సేఫ్ జాకెట్ ధరించిన ఓ పోలీసు ఒక చేత్తో లాఠీ, మరో చేత్తో రివాల్వర్ పట్టుకొని ఓ మూలకు వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిపై రివాల్వర్తో కాల్పులు జరిపినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో ఆందోళనకారులెవరూ రాళ్లు రువ్వడం కానీ పోలీసులపై దాడికి దిగినట్లుగానీ కనిపించకపోవడం గమనార్హం.