
గౌహతి: గత జన్మలో చేసిన పాపాల ఫలితంగానే క్యాన్సర్ లేదా ప్రమాదాల్లో మృత్యువాత పడతారని, ఇదంతా కర్మ ఫలితమేనన్న అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను యోగా గురు బాబా రాందేవ్ సమర్ధించారు. కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనని అస్సాం పర్యటనకు వచ్చిన బాబా రాందేవ్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
అస్సాం మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే హిమంత శర్మ చెప్పింది విస్తృత కోణంలో చూస్తే సరైనదేనని, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని రాందేవ్ అన్నారు. ఏ వ్యక్తి పొందే మంచి లేదా చెడు అనేది కర్మ ఫలంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
వ్యాధులకు పలు కారణాలుంటాయని, వాటిలో జన్యుపరమైన అంశాలు ఒకటని..ఇవి కూడా కర్మ ఫలితంతో పాటు అలవాట్లు, పరిసరాల ప్రభావంతో ముడిపడి ఉంటాయని చెప్పుకొచ్చారు. మనిషి చావు, పుట్టుక అన్నీ కర్మ ఫలమేనన్నారు.