
లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో భేటీ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలోనూ ఢిల్లీ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం కొలిక్కిరాలేదు.
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను బాహాటంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ధ్వజమెత్తారు. ఎల్జీ అనిల్ బైజల్తో భేటీ అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ సేవల విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదని చెప్పారు.
సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రధమమని అన్నారు. సేవల విభాగాన్ని ఢిల్లీ సర్కార్కు అప్పగించరాదని హోంమంత్రిత్వ శాఖ తనకు సూచించిందని బైజల్ తనతో చెప్పారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
పోలీసులు, భూములు, పబ్లిక్ ఆర్డర్ మినహా అన్ని అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటలకే ఢిల్లీ ప్రభుత్వం అధికారుల బదిలీలు, నియామకాల కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో నూతన వ్యవస్థను ప్రవేశపెట్టింది.