మామ బాటలో నాలుగుసార్లు..
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మామ, పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ నాలుగు సార్లు సీఎం అయ్యారని, తానూ నాలుగుసార్లు డిప్యూటీ సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. పూణే జిల్లాలోని తన నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎంగా నాలుగుసార్లు సాహెబ్ (శరద్ పవార్)ను పాలనా పగ్గాలు చేపట్టేందుకు పార్టీ కార్యకర్తగా కృషి చేశానని..ఇక తానూ నాలుగు సార్లు ఉప ముఖ్యమంత్రి అయ్యానని ప్రేక్షకుల నవ్వుల మధ్య అజిత్ పవార్ అన్నారు.
సాహెబ్ నాలుగు సార్లు సీఎంగా కాగలిగితే తాను ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. అజిత్ పవార్ 1999-2014 వరకూ కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ హయాంలో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గత ఏడాది నవంబర్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపి ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మూడోసారి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో తిరిగి ఎన్సీపీ గూటికి చేరిన అజిత్ పవార్ గత ఏడాది డిసెంబర్ 30న నాలుగో సారి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.