20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు | Vallabhaneni Ashok Presents Rajinikanth's 'PETTA' in Telugu | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు

Jan 3 2019 4:07 AM | Updated on Sep 12 2019 10:40 AM

Vallabhaneni Ashok Presents Rajinikanth's 'PETTA' in Telugu - Sakshi

‘పేట’లో రజనీకాంత్‌

‘‘రజనీకాంత్‌గారికి నేను పెద్ద అభిమానిని. బస్‌ కండక్టర్‌ నుంచి ఆల్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారాయన. పైగా మంచి సేవాగుణం ఉంది. అందుకే రజనీకాంత్‌గారే నాకు స్ఫూర్తి. ఈ రోజు స్టేజ్‌పైన ఆయన పక్కన నిలబడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు నేనెంతో కష్టపడ్డాను కూడా’’ అని నిర్మాత వల్లభనేని అశోక్‌ అన్నారు. రజనీకాంత్‌ హీరోగా, త్రిష, సిమ్రాన్‌ హీరోయిన్లుగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’.

ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్‌ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ– ‘‘ఇందులో 20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు. ‘బాషా, ముత్తు, నరసింహ’ సినిమాల కంటే మరో లెవల్‌లో ‘పేట’ సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మధ్యలో మా సినిమా రిలీజ్‌ అవుతోంది. థియేటర్లు చాలా తక్కువగా దొరికాయి. కానీ, సినిమా బాగుంది కాబట్టి విడుదల తర్వాత థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘పేట’ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది పోటీ పడ్డారు.

మా బ్యానర్‌లో ఈ మధ్య ‘నవాబ్, సర్కార్‌’ చిత్రాలను మంచి పబ్లిసిటీతో రిలీజ్‌ చేశాం. ఆ నమ్మకంతోనే సన్‌ పిక్చర్స్‌ వారు.. వేరే వారు ఆఫర్‌ చేసిన ఫ్యాన్సీ రేటుకంటే కోటిన్నర రెండు కోట్లు తగ్గించి నాకు ఇచ్చారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నాం. రజనీగారితో పాటు యూనిట్‌ అంతా వస్తారు. మా నాన్నగారు బ్రెయిన్‌ ట్యూమర్‌తో  చనిపోయారు. అప్పటి నుంచి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇందులో భాగంగా ఇదే వేదికపై కొన్ని అనాథాశ్రమాలకు, ఇతర సేవలు అందిస్తున్న కొందరికి రజనీగారి చేతుల మీదుగా చెక్‌లను అందిస్తాం. ఈ ఏడాది తెలుగులో ఓ స్ట్రయిట్‌ సినిమా చేయనున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నా’’ అన్నారు.

అశోక్‌ వల్లభనేని

Advertisement
 
Advertisement
Advertisement