
తమన్నా
తమిళసినిమా: మానసిక వేదనకు మందిదే అంటోంది నటి తమన్నా. నటిగా పుష్కరం దాటినా నేటికీ నవనవలాడే అందాలతో మెరిసిపోతోంది మిల్కీబ్యూటీ. మొదట్లో అందాలారబోతకే పరిమితం అయిన ఈ గుజరాతీ భామ తరువాత నటనకు కూడా ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటోంది. తెలుగు, తమిళం అంటూ మారి మారి నటించేస్తున్న తమన్నా కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్తో నటించిన కన్నెకలైమానే చిత్రం విడుదల కావలసి ఉంది.ఈ చిత్రంలో తమన్నా నటన గురించి దర్శక, హీరోలు కాస్త ఎక్కువగానే పొగిడేస్తున్నారు. ఇక మీ సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ అందం, ప్రశాంతత, మానసికవేదన లేకుండడం అన్నది ప్రతి మనిషికీ చాలా ముఖ్యం అని చెప్పింది. అందుకు తాను నమ్మేది మోగానేనని పేర్కొంది. తన దినచర్య ప్రతిరోజూ యోగాతో ముడిపడి ఉంటుందంది. గోరు వెచ్చని నీటిలో బాదంను నానబెట్టి తిన్న తరువాతే ఇతర కార్యక్రమాలకు ఉపక్రమిస్తానని చెప్పింది.
రోజూ గంట సేపు వ్యాయామం చేస్తానని, అందులో అరగంట కసరత్తులు చేసి మరో అరగంట యోగాకు కేటాయిస్తానని తెలిపింది. ఇవన్నీ జిమ్లోనే జరిగిపోతాయని అంది. మానసిక వేదనకు ఇదే మందు అని పేర్కొంది. ఎవరన్నా యోగా గురించి ప్రస్తావిస్తే వారితో గంటల తరబడి మాట్లాడతానని చెప్పింది.యోగాతో శరీరంలోని విష క్రిములు బయటకు పోతాయని అంది. శ్రమకు ఉపశమనం కలుగుతుందని, ఆశాంతి, మానసిక వేదన సమసిపోతాయని చెప్పింది. మనసులో నెగిటివ్ ఆలోచనలు కలగవని అంది. సినిమా అన్నది సమస్యలు, సవాళ్లతో కూడుకున్న రంగం అని సరిగ్గా నిద్ర ఉండదు, ఆహార నియమాలను ఆటంకం అన్నది తరచూ జరుగుతుంటుందని చెప్పింది. శారీరకంగానూ, మానసికంగానూ నలిగిపోతుంటామని తెలిపింది. ఇలాంటి వాటి నుంచి బయట పడడానికి ఒకే మార్గం యోగా అని పేర్కొంది. తాను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, మేను సున్నితంగా ఉండడానికి పెరుగు, మంచినీళ్లు, కొబ్బరినీరు తీసుకుంటానని చెప్పింది. చెడు కలిగించే వాటిని ముట్టుకోనని, తీపిని విరోధిగా చూస్తానని తమన్నా చెప్పింది.