ఇప్పుడు బాధ పడ్డా.. భవిష్యత్తులో గర్వపడతాడు: నటి

Rupali Ganguly on Shooting During the Pandemic - Sakshi

కరోనా నేపథ్యంలో రెండు, మూడు నెలలుగా సినిమా, సీరియల్స్‌ షూటింగులకు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. గత నెల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగు‌లకు అనుమతిచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే షూటింగు‌ల్లో పాల్గొంటున్న నటీనటులు కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నటి రూపాలి గంగూలీ దీనిపై స్పందిస్తూ.. ‘షూటింగ్‌ నుంచి వచ్చాక నా కొడుకు రుద్రాన్ష్‌ను హత్తుకోవడం లేదు. ముద్దు పెట్టుకోవడం లేదు. తనకు వీలైనంత దూరంగా ఉంటున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. ఓ రోజు నా కొడుకు ‘అమ్మా.. నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఇంకో ఆరు నెలలు ఆగాలా’ అని అడిగాడు. అది విని నా గుండె బద్దలయ్యింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నేను దూరంగా ఉన్నందుకు నా కుమారుడు బాధపడతాడేమో కానీ భవిష్యత్తులో నా నటన చూసి చాలా గర్వపడతాడు’ అని తెలిపారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్)

రూపాలి గంగూలీ ప్రస్తుతం స్టార్‌ ప్లస్‌లో ప్రసారం అవుతున్న ‘అనుపమా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఇది ప్రసారం అవుతోంది. రూపాలి చివరిసారిగా సారాభాయ్‌ వర్సెస్‌ సారాభాయ్‌ వెబ్‌సిరీస్‌లో నటించారు. గత ఏడేళ్లుగా రూపాలి టెలివిజన్‌కు దూరంగా ఉన్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఓ అద్భుతమైన పాత్రతో, గొప్ప ప్రదర్శనతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కాస్తా భయంగా ఉంటుంది. కానీ చాలా మంది ఆశీర్వాదాలు పొందిన వారు మాత్రమే ఇలా తిరిగి రాగలరు. ఇది భయపెడుతుంది. మీపై పెద్ద బాధ్యత ఉన్నట్లు గుర్తు చేస్తుంది’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top