రజనీ మెచ్చిన తరమణి

రజనీ మెచ్చిన తరమణి


తమిళసినిమా: తరమణి చిత్రం గురించి ఇప్పటికే చాలా విషయాలు చెప్పుకున్నాం. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు రామ్‌నే. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌ తాజాగా తెరకెక్కించిన చిత్రం తరమణి. జేఎస్‌కే ఫిలింస్‌ పతాకంపై జే.సతీష్‌కుమార్‌ నిర్మించిన ఇందులో నవ నటుడు రవి, ఆండ్రియా జంటగా నటించారు. నిర్మాత జే.సతీష్‌కుమార్‌ కూడా తొలిసారిగా ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించడం విశేషం. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను చూరగొంటోంది. దీంతో చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు.



ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జే.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ తరమణి చిత్రం విజయం సాధించడం ఒక సంతోషం అయితే, చిత్రం చూసిన నటుడు రజనీకాంత్‌ అభినందించడం ఇంకా ఆనందంగా ఉందని అన్నారు. సోమవారం తరమణి చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ తనకు ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించారన్నారు. తాను కొంచెం ఆశ్చర్యంతోనే రజనీకాంత్‌ను కలవడానికి వెళ్లానని చెప్పారు.అయితే ఆయన తరమణి చిత్రంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించి చాలా బోల్డ్‌ చిత్రం అని అభినంధించారని అన్నారు. అంతే కాకుండా తన నటనను ప్రశంసించడం ఎనలేని ఆనందాన్ని కలిగించిందన్నారు. రజనీకాంత్‌ లాంటి లెజెండ్స్‌ ప్రశంసలు తనకు, తన సంస్థకు తరమణి లాంటి మంచి చిత్రాలు మరిన్ని నిర్మించడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయని జే.సతీష్‌కుమార్‌ అన్నారు. తరమణి చిత్రం విడుదల తరువాత మరిన్ని స్క్రీన్‌లు పెరిగాయని ఆయన తెలిపారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top