ప్రియుడి కోసం ఒక చిత్రం

Nayantara Producing For Vignesh Shiva - Sakshi

తమిళసినిమా: భర్తను హీరోగా పరిచయం చేయడం కోసమో, సోదరులను నిర్మాతలుగానో, నటులు గానో పరిచయం చేయడం కోసమో హీరోయిన్లు చిత్ర నిర్మాణం చేపట్టడం అన్నది సాధారణంగా జరుగుతున్నదే. కాగా అగ్రనటి నయనతార కూడా ఇప్పుడు అదే బాట పట్టనున్నారనే ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలతో పాటు స్టార్‌ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య అరమ్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమెకు చాలా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ చిత్రానికి నిర్మాత ఆమె మేనేజర్‌ అని చెప్పినా, తరువాత పెట్డుబడి అంతా నయనతారదేననే ప్రచారం జరిగింది. దీన్ని ఎవరూ ఖండించలేదు కూడా.

ఇప్పుడు ఈ సంచలన నటి నేరుగానే చిత్ర నిర్మాణంలోకి దిగుతోందన్నది తాజా సమాచారం. తన ప్రియుడుగా ప్రచారంలో ఉన్నదర్శకుడు విఘ్నేశ్‌శివ కోసం నయనతార ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయినట్లు టాక్‌. విఘ్నేశ్‌శివ సూర్య హీరోగా చేసిన తానాసేర్నద కూటం చిత్రం తరువాత మరో చిత్రం కమిట్‌ కాలేదు. తాజాగా నయనతార నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారట. ఇందులో యువ నటుడు అధర్వ హీరోగా నటించనున్నారని, దీనికి ఇదయం మురళి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే నయనతార, అధర్వ కలిసి ఇమైకా నోడిగళ్‌ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా తన ప్రియుడి కోసం తాను నిర్మించే చిత్రంలో ఆమె నటిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top