గాయత్రి: బాబు అండ్‌ కోపై మోహన్‌బాబు సెటైర్ల వర్షం!

mohanbabu satirical dialogs in gayatri movie viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తాజా సినిమా ‘గాయత్రి’. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్‌బాబు డైలాగ్స్‌ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తోంది. ఓ సీన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎండగడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరుల తీరుపై మోహన్‌బాబు వేసిన సెటైర్లు.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

‘అటవీశాఖ మంత్రికి జాతీయ పక్షి ఏమిటో తెలియదు. క్రీడాశాఖమంత్రికి ఒలింపిక్స్‌లో మనకెన్ని పతకాలు వచ్చాయో తెలియదు. రవాణాశాఖ మంత్రికి రన్నింగ్‌ బస్సెలెన్నో తెలియదు. ఛీఛీఛీ.. మంత్రివర్యా.. బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివానని ఒకడు.. బీఎస్సీలో హెచ్‌ఈసీ చదివానని ఇంకొకడు.. నేనిచ్చిన పెన్షన్‌ తీసుకుంటూ.. నేనేసిన రోడ్ల మీద నడుస్తూ.. నాకే ఓటు ఎందుకు వేయరని అడిగేవాళ్లు ఇంకొందరు.. భారతదేశ సార్వభౌమధికారం అని పలుకడం చేతకాక.. సార్వబౌబౌ అనేవాళ్లు ఇంకొందరు.. మీరందరూ మంత్రులూ.. మీకు మేం ఓట్లేసి గెలిపించాం’ అంటూ మోహన్‌బాబు సెటైరికల్‌గా పేల్చిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయానా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, సీఎం తనయుడు లోకేశ్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబాటుకు గురవ్వడాన్ని వ్యంగ్యంగా గుర్తుచేసేలా మోహన్‌బాబు డైలాగ్‌ ఉందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top