లారాను తప్పుగా చిత్రీకరించలేదు | Sakshi
Sakshi News home page

లారాను తప్పుగా చిత్రీకరించలేదు

Published Thu, Nov 15 2018 1:20 AM

Contraversy Rangu Movie Press Meet - Sakshi

విజయవాడకు చెందిన పవన్‌ కుమార్‌ (లారా) కథతో ‘రంగు’ చిత్రం రూపొందింది. తనీష్‌ ముఖ్య పాత్రలో కార్తికేయ దర్శకత్వం వహించారు. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించారు. ఈ చిత్రంలో లారాను ఎలా చూపించబోతున్నారో మాకు తెలియాలి. మా అనుమతి తీసుకోకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్స్‌లో ‘రంగు’ పడనివ్వం అని సోమవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు లారా బంధువులు. దానికి సమాధానంగా ‘రంగు’ చిత్రబృందం బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘లారా బంధువుల ఆరోపణలు సబబుగానే అనిపించాయి. కానీ మేం లారాని ఎక్కడా తప్పుగా చూపించలేదు.

సినిమా చూస్తే ఆయన మీద మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఈ శని, ఆదివారాల్లో లారా కుటుంబ సభ్యులకు షో వేసి చిత్రాన్ని చూపిస్తాం. ఈ నెల 23న సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘మనిషి సమాజంలో ఎలా ఉండకూడదో చెప్పే సినిమా ఇది. లారా పాత్ర, ఐడియాలజీ.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అని తనీష్‌ అన్నారు. ‘‘2011 నుంచి నేను లారాని స్టడీ చేసి ఈ కథ రాసుకున్నాను. ఆయన బావమరిదిని కలవలేదు. కానీ ఆయన స్నేహితులను కలిశాను. సినిమా చూస్తే లారా మన మధ్య ఇంకా తిరుగుతున్నారనే భావన కలుగుతుంది’’ అని కార్తికేయ అన్నారు. చిత్రనిర్మాత నల్ల అయ్యన్న నాయుడు, సహ నిర్మాత వాసు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement