సైడ్‌ బిజినెస్‌కు అమలాపాల్‌ | Amala Paul Focus On Nutrition Business | Sakshi
Sakshi News home page

సైడ్‌ బిజినెస్‌కు అమలాపాల్‌

Oct 10 2018 12:43 PM | Updated on Oct 10 2018 12:43 PM

Amala Paul Focus On Nutrition Business - Sakshi

సినిమా: ఒకప్పటి హీరోయిన్ల దృక్పథం వేరు, ఇప్పటి హీరోయిన్ల ఆలోచనలు వేరు. పాత తరం హీరోయిన్లు కొందరు తమ సంపాదనను సినిమా రంగంలోనే ఉపయోగించేవారు. మరికొందరు ఆస్తులను కూడబెట్టుకున్నారు. అయితే నేటి హీరోయిన్లు దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. కారణం అప్పటి వారి కంటే ఇప్పుటి తారలకు వృత్తి పరంగా అభద్రతా భావం ఎక్కువ అన్న విషయం తెలుసు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతలా సంపాదించుకున్నది ఇతర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసుకుంటున్నారు. ఈ తరం అగ్రతారలు చాలామంది నటనతో పాటు ఇతర రంగాల్లో పెట్టబడులు పెడుతున్నారు. నటి త్రిష, కాజల్‌అగర్వాల్, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌  ఇతర రంగాల్లో ఆదాయం గడిస్తున్నారు. ఇప్పుడు నటి అమలాపాల్‌ కూడా అదే బాట పట్టనుందట. సంచలనాలకు మారుపేరుగా మారిన ఈ కేరళ భామ దర్శకుడు విజయ్‌తో పెళ్లి, విడాకుల తతంగం జరిగిపోయిన తరువాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ఆడైలో గ్లామరస్‌ దుస్తులు ధరించి మరోసారి నెటిజన్ల చేతికి చిక్కింది.

అయితే ఆ చిత్రంలోని పాత్ర డిమాండ్‌ చేయడంతోనే అలా నటించాల్సి వచ్చిందని తనను తాను సమర్థించుకుంటున్న అమలాపాల్‌ నటిస్తున్న హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం ఆడై. అదేవిధంగా ఆదో అంద పరవై పోల అనే మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో పాగా వేయడానికి రెడీ అవుతున్న అమలాపాల్‌ తాజాగా సైడ్‌ బిజినెస్‌కు సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. సామాజిక సేవా కార్యక్రమాలపై అక్కర చూపిస్తున్న ఈ అమ్మడు ఆ మధ్య కేరళలో వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి స్వయంగా రంగంలోకి దిగింది. ఇప్పుడు పౌష్టికాహారాలు తయారు చేసే వ్యాపార సంస్థను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ఈ సంస్థలో మహిళలను ప్రోత్సహించే విధంగా వారికే ఉద్యోగావకాశాలను కల్పించాలని నిర్ణయించుకుందట. అమలాపాల్‌ పౌష్టికాహార ఉత్పత్తుల వ్యాపారం మహిళలు స్వయం ఉపాధితో ఎదగడానికి ఈ సంస్థ ఒక మార్గదర్శి అవుతుందనే హర్షాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.అమలాపాలా! మజాకా.

Advertisement
 
Advertisement
Advertisement