ఆమెను చావు కూడా మోసం చేసింది | Kanchanamala Moideen Love Story | Sakshi
Sakshi News home page

ఆమెను చావు కూడా మోసం చేసింది

Oct 7 2019 11:27 AM | Updated on Oct 30 2019 5:27 PM

Kanchanamala Moideen Love Story - Sakshi

 ‘నీ కనురెప్పను తాకి... చినుకు జీవితం ధన్యమైపోయింది. నీ పాదాల్ని తడిమిన మట్టి... కొత్త పరిమళంతో ఊరేగుతోంది.’

తెల్లటి కాగితం మీద ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అక్షరాలను మురిపెంగా తడిమింది కాంచనమాల. మొయిదీన్ తన కళ్ల ముందున్నట్లే అని పించింది. చిన్నప్పటి నుంచి తనతో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాడు. అతడి గోధుమరంగు కళ్లు, మళ్లీ మళ్లీ వినాలని పించే నవ్వు ఆమెకి చాలా ఇష్టం! కేరళలోని ఇరువజింజి నది ఒడ్డున ఉన్న గ్రామం ‘ముక్కం’. ఇరువజింజి నదే కాంచన-మొయిదీన్‌ల ప్రేమకు సాక్షి. ఒకరోజు... ‘‘కాంచనా... నేను నిన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నాను. నువ్వు డాక్టర్ కాకపోయినా ఫరవాలేదుగానీ కుటుంబ పరువును మంటగలపకు. ఆ ముస్లిం కుర్రాడితో తిరగడం మానెయ్’’ అని కుమార్తెను హెచ్చ రించాడు అచ్యుతన్. ‘‘నీవల్ల  బయట తలెత్తుకోలేక పోతున్నానురా’’ అంటూ ముఖం కందగడ్డలా చేసుకుని కొడుకును తిట్టడం మొదలుపెట్టాడు ఉన్నిమొయి.


అరవయ్యేళ్ల క్రితం... ఒకబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితేనే కలికాలం అని బుగ్గలు నొక్కుకునే రోజుల్లో... వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకోవ డమంటే మాటలు కాదు. అందుకే చదువు మాన్పించి కూతుర్ని ఇంటికి పరిమితం చేశాడు అచ్యుతన్. కొడుకును కత్తితో పొడవడానికి సైతం సిద్ధపడ్డాడు ఉన్ని మొయి. అయిన్పటికీ లేఖల రూపంలో వారి ప్రేమ సజీవంగానే ఉంది. ఎట్టకేలకు ఒకరోజు రహస్యంగా కలుసుకున్నారిద్దరూ. రెండు మూడు రోజుల్లో పారిపోయి పెళ్లి చేసుకోవాలను కున్నారు. విషయం అచ్యుతన్‌కు తెలిసి పోయింది. ఈసారి ఆయన ఆగ్రహంతో ఊగిపోలేదు. ‘‘నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. నీ చెల్లెళ్ల భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వీళ్ల పెళ్లి ఈ జన్మలో జరుగుతుందా!’’ అన్నాడు కన్నీళ్లతో.

 కరిగిపోయింది కాంచన. చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిపోయేవరకు  ఇల్లు దాటి బయటికి వెళ్లకూడదనుకుంది. వెళ్లలేదు కూడా! పెళ్లిళ్లు అయిపోయాయి. ‘ఇక నా పెళ్లి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు’ అనుకున్న కాంచన పెళ్లికి సిద్ధపడింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ తమ్ముడు చనిపోయాడు. ఆ బాధ నుంచి  తేరుకోలేక నాన్న గుండెపోటుతో మరణించాడు. మరోవైపు మొయిదీన్ తండ్రి ఉన్నిమొయి చనిపోయాడు.

2015 ‘ఇన్ను నింటే మొయిదీన్‌’ చిత్ర పోస్టర్‌
కాలం దొర్లిపోతోంది. మొయిదీన్ జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. బాధ నుంచి ఉపశమనం కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. కొద్దికాలం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోదామనుకున్నారు. పాస్‌పోర్టుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పుడే విధి వారి జీవితంతో మరోసారి ఆడుకుంది. ఓరోజు పడవలో ఊరికి వస్తున్నప్పుడు, పడవ మునిగిపోయి చనిపోయాడు మొయిదీన్. విలవిల్లాడిపోయింది కాంచన. అతడు లేని లోకంలో ఉండలేనంటూ ఆత్మహత్యాప్రయత్నం చేసింది.

కానీ చావు కూడా ఆమెను మోసం చేసింది. దాంతో బతకలేక చావలేక అల్లాడిపోయింది కాంచన. ఆమె వేదన గురించి విన్న మొయిదీన్ తల్లి కాంచనను తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్త గారింట్లోనే ఉంటోంది కాంచన.  తమ ఊరిలో ‘మొయిదీన్ సేవా మందిర్’ పేరుతో స్వచ్ఛందసేవా సంస్థను ప్రారంభించింది. ఎన్నో రకాలుగా సేవ చేస్తోంది. ఆ సేవా మందిర్‌లో గోడకు వేళ్లాడుతూ కనిపించే మొయిదీన్ నిలువెత్తు చిత్రం... కాంచనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నేటికీ కవిత్వం చెబుతున్నట్లే ఉంటుంది!

మొయిదీన్, కాంచనమాలల ప్రేమకథను మలయాళంలో ‘ఇన్ను నింటె మొయిదీన్’ పేరుతో సినిమా తీసి ఘన విజయం సాధించాడు డెరైక్టర్ ఆర్.ఎస్.విమల్. మొయిదీన్‌గా పృథ్వీరాజ్, కాంచనమాలగా పార్వతి నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలే కాదు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. పృథ్వీరాజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
- యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement