బడికి వెళ్లాలంటే..అడవికి వెళ్లాలా?

Students Will Go School Through Forest - Sakshi

సాక్షి, అశ్వారావుపేటరూరల్‌: వారంతా రేపటి పౌరులు.. ఈ భావి భారత పౌరులు బడిబాట పట్టాలంటే ముందుగా అడవి బాట పట్టాల్సిందే. అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోనే ప్రభుత్వ బడులు చాలా వరకు విద్యార్థులలేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దాదాపు ముపైమందికిపైగా విద్యార్థులున్న ఆ గిరిజన గ్రామంలో మాత్రం సర్కారు బడి లేకుండా పోయింది. దాంతో ఆ గిరిజన బిడ్డలు ఉన్నత విద్య కోసం మూడు మైళ్ల దూరం అడవిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 

అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మారుమూల అటవీ ప్రాంతంలో కొండతోగు అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం మాత్రమే ఉండగా, ప్రాథమిక పాఠశాల లేదు. దాంతో ప్రతి ఏటా బడులు తెరిస్తే చాలు.. ఈ అడవి బిడ్డలు విద్య కోసం మూడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామంలో ఉన్న బడికి వెళ్లాలంటే కొండతోగు నుంచి అడవి మార్గంలో కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షకాలం సీజన్‌లో ఐతే అడవి మార్గంలో ఉన్న కొండతోగు వాగు పారుతుంది.

వర్షం తగ్గిన తర్వాత మెకాళ్లలోతులో ఉండే నీళ్లు దాటుకొని ఈ చిన్నారులు సాహసంతో బడికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు గత ఐదేళ్లుగా నెలకొని ఉన్నప్పటికీ అధికారులు, పాలకులకు కనీసం పట్టడం లేదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘బడిబాట’కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్న క్రమంలో ఈ ‘అడవి బాట’పట్టుతున్న గిరిజన బిడ్డల అవస్థలను సైతం దృష్టిలో పెట్టుకొని, ఆ గ్రామంలో సర్కారు పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందేమో కాస్తా ఆలోచించాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top