పాక్‌పై అమెరికా ఆంక్షల కొరడా

US imposes visa sanctions on Pakistan - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌పై మరోసారి కఠిన వైఖరి తీసుకుంది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, వీసా గడువు ముగిశాక తిష్టవేసిన పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో పాకిస్తాన్‌పై  తాజాగా ఆంక్షల కొరడా ఝళిపించింది. ఈ పరిణామంతో అమెరికా ఆంక్షల భారం పడిన 10 దేశాల జాబితాలో పాకిస్తాన్‌ సైతం చేరినట్లయింది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించడంతో ఆఫ్రికా దేశం ఘనాపైనా ఈ ఏడాది ఆంక్షలు విధించింది. ఈ రెండు దేశాలతోపాటు గయానా (2001), గాంబియా (2016), కాంబోడియా, ఎరిట్రియా, గినియా, సియెర్రాలియోన్‌ (2017), బర్మా, లావోస్‌ (2018)పైనా అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆంక్షల కారణంగా ఆయా దేశాల పౌరులు, నివాసితులకు ఎటువంటి కారణం చూపకుండా వీసా ఆలస్యం చేయవచ్చు లేదా నిరాకరించేందుకు అమెరికా హోంశాఖకు అధికారం ఉంటుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నందున ఈ ఆంక్షల విషయమై స్పందించలేమని అమెరికా హోం శాఖ తెలిపింది. అయితే, ఆంక్షల ప్రభావం పాక్‌పై పరిమితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top