నవాజ్‌ జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు | Nawaz Sharif, Daughter To Be Released; Pak Court Suspends Jail Sentence | Sakshi
Sakshi News home page

నవాజ్‌ జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు

Sep 19 2018 4:23 PM | Updated on Nov 6 2018 8:51 PM

Nawaz Sharif, Daughter To Be Released; Pak Court Suspends Jail Sentence - Sakshi

ఇస్లామాబాద్:  అవినీతిలో కేసులో  జైలుపాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ కుటుంబానికి భారీ ఊరట లభించింది. అవెన్‌ఫీల్డ్ కేసులో జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ హై కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత వారం, లండన్లో కాన్సర్‌తో చనిపోయిన షరీఫ్‌ భార్య, కుల్సోంకు అంత్యక్రియల నిమిత్తం  నవాజ్‌  షరీఫ్‌, ఆయన కుమార్తె 5 రోజుల పెరోల్‌ మీద విడుదలయ్యారు. తాజా తీర్పుతో వీరిద్దరితోపాటు నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు కెప్టెన్ సఫ్‌దార్  విడుదల కానున్నారు. 

జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ కోర్టు రద్దు చేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని,  అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి ఎలాంటి రుజువు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్లు,  మరియం నవాజ్‌కు 8 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. అ‍ల్లుడు కెప్టెన్ సఫ్‌దార్ కూడా ఈ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జైల్లో ఉ‍న్న సంగతి తెలిసిందే. అయితే రూ.5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గుర్ని రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది.

ఈ ఏడాది జూలై ఆరో తేదీన అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement