క్వెట్టాలో బాంబుపేలుడు, ఆరుగురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందగా.. 8 మంది గాయపడ్డారు. క్వెట్టా-సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్వెట్టాలో భద్రతాబలగాలపై దాడులు ఇటీవలికాలంలో ఎక్కువయిపోయాయి. ఆగస్టు 13న మిలటరీ వాహనం లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జూన్ 14న జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.