తెరిచిన సూళ్లను మళ్లీ మూసివేస్తున్నారు | 20 More Schools Closed In Israel As Coronavirus Rise In Month | Sakshi
Sakshi News home page

తెరిచిన సూళ్లను మళ్లీ మూసివేస్తున్నారు

Jun 5 2020 8:51 PM | Updated on Jun 5 2020 9:11 PM

20 More Schools Closed In Israel As Coronavirus Rise In Month - Sakshi

జెరూసలెం : ఇజ్రాయెల్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ కేసులు గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కాగా మే మొదటివారంలోనే ఇజ్రాయిల్‌లో పాఠశాలలు తెరిచారు. అయితే కరోనా వైరస్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న చోట తెరిచిన స్కూళ్లను మళ్లీ మూసేస్తున్నారు. గురువారం ఇజ్రాయిల్‌లోని రెండు ప్రాంతాల్లో మరో 20 స్కూళ్లను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఒకే పాఠశాలలో 301 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారీన పడినట్లు తేలింది. వీరంతా వైరస్ బారిన పడటం వల్ల మరో 13,696 మంది  గృహ నిర్బంధంలో ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. (వలస కార్మికులతో క్రైమ్‌ పెరుగుదల!)

కాగా మూసివేసిన పాఠశాలల్లో టెల్ అవీవ్‌లో ప్రాంతం​ నుంచే రెండు ఉన్నాయి, ఇక్కడి పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు సహా అనేక మంది విద్యార్థులు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారింపబడ్డారు. కాగా సఫేద్‌ నగరంలోని స్కూల్‌ సిబ్బందిలో ఒకరితో పాటు వ్యాన్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో స్కూల్లోని దాదాపు 250 మంది విద్యార్థులతో పాటు సిబ్బందిని కూడా హోం క్వారంటైన్‌కు తరలించారు.దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్ధేశంతో పాఠశాలలు తెరవాలని నెల క్రితం అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపు రెండు నెలల తర్వాత తరగతులు ప్రారంభం కాగా ప్రతీ విద్యార్థితో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరగతి గదుల్లో కఠినమైన పరిశుభ్రత పద్దతులను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు(మే 3న) 60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రమంగా ఆ సంఖ్య ఫుంజుకున్నా క్రమేపీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలను మూసివేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌లో 17,495 కరోనా కేసులు నమోదవ్వగా 291 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2191గా ఉంది. (జూలై నెలాఖరుకు 1.5 లక్షల కేసుల నమోదు)

Advertisement
 
Advertisement
Advertisement