మారిన రాతలు | Then the mayors .. now corporators | Sakshi
Sakshi News home page

మారిన రాతలు

Feb 6 2016 1:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

గత పాలక మండలిలో మేయర్లుగా... వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారిలో కొంద రు ఓటమి పాలైతే...

అప్పుడు మేయర్లు.. ఇప్పుడు కార్పొరేటర్లు
మాజీ మేయర్ కార్తీక రెడ్డి ఓటమి
మళ్లీ గెలిచిన బంగారి ప్రకాశ్

 
సిటీబ్యూరో: గత పాలక మండలిలో మేయర్లుగా... వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారిలో కొంద రు ఓటమి పాలైతే... మరికొందరు విజయం సాధిం చారు. గతంలో కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందం మేరకు బండ కార్తీక రెడ్డి, మాజిద్ హుస్సేన్‌లు మేయర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో తాను గెలి చిన తార్నాక డివిజన్ నుంచే మరోసారి పోటీ చేసిన కార్తీకరెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో అహ్మద్ నగర్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన మాజిద్ హుస్సేన్ ఈసారి మెహదీపట్నం నుంచి గెలిచారు. ఇంతకుముందు బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన బంగారి ప్రకాశ్‌కు ఈసారి ఆ పార్టీ టికెట్ లభించలేదు. దీంతో నామినేషన్లకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై గుడిమల్కాపూర్ నుంచి గెలిచారు. గతంలో ఆయన మెహదీపట్నం నుంచి గెలుపొందా రు. కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కాలేరు వెంకటేశ్, టీడీపీ ఫ్లోర్‌లీడర్  సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో తాము పోటీ చేసిన స్థానాలు మహిళలకు రిజ ర్వు కావడంతో వారి సతీమణులను బరిలో దింపారు. టీఆర్‌ఎస్ టికెట్‌పై వారిద్దరూ గెలిచారు. సింగిరెడ్డి భార్య స్వర్ణలతా రెడ్డి సైదాబాద్  నుంచి... కాలేరు వెంక టేశ్ భార్య పద్మ గోల్నాక నుంచి ఎన్నిక య్యారు.
 
నూరు శాతం ట్యాంపరింగ్ చేశారు: బండ కార్తీకరెడ్డి   
గ్రేటర్‌లో వంద సీట్లు గెలుస్తామని చెప్పి.. దాన్ని సాధించేందుకు టీఆర్‌ఎస్ నేతలు నగరమంతా ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. గతంలో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన కార్తీకరెడ్డి.. ఈసారి తార్నాక డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. న్యాయంగా ఓట్ల లెక్కింపు జరిగితే టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వచ్చేంత సీన్ లేదని... తమ పంతం నెగ్గించుకునేందుకే ట్యాంపరింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ఫలితాల అనంతరం గద్గద స్వరంతో మాట్లాడుతూ... ‘ఎన్నో కాలనీల వాళ్లు నాకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ  ఏ బూత్‌లోనూ నా అంచనా మేరకు ఓట్లు రాలేదు’ అన్నారు.

మరో వార్డు అడ్డగుట్టలోని  24వ నెంబరు బూత్‌లో 566 ఓట్లు మాత్రమే పోల్ కాగా... తొలుత టీఆర్‌ఎస్‌కు 932 ఓట్లు వచ్చినట్లు చెప్పారన్నారు. అరచి గోల చేస్తే మళ్లీ ఈవీఎం బటన్లు నొక్కి... టీఆర్‌ఎస్‌కు 399, కాంగ్రెస్‌కు 95, 11 బీఎస్‌పీకి, ఇతరర పార్టీలకు మరికొన్ని వచ్చినట్టు చెప్పారని తెలిపారు. అన్నీ కలిపితే పోలైన ఓట్ల కంటే ఎక్కువే ఉన్నాయని అన్నారు. నగరమంతా ట్యాంపరింగ్ జరిగిందనేందుకు ఇదే నిదర్శనమని ఆమె చెప్పా రు. గత ఎన్నికల్లో 52 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి కనీసం 50 రాగలవని అంచనా వేశామని... ట్యాంపరింగ్ వల్లే తమ పార్టీకి సీట్లు రాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement