
సిలికాన్వ్యాలీ ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తి
సిలికాన్ వ్యాలీ వంటి టెక్ ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
టీఐఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగం
సాక్షి,హైదరాబాద్: సిలికాన్ వ్యాలీ వంటి టెక్ ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిలికాన్ వ్యాలీ విజయానికి ఇక్కడి అనుకూల వాతావరణమే ప్రధాన కారణమని, అదే తరహాలో హైదరాబాద్లోనూ నూతన ఆలోచనలను ప్రోత్సహించేందుకు టీ-హబ్ను ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్ అవుట్ పోస్ట్ను సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బుధవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిలికాన్ వ్యాలీలో ప్రసంగించారు.
ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్(టీఐఈ)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలపై మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే తమ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వాలు తాత్కాలికం, విధానాలు శాశ్వతమన్నదే తమ నమ్మకమన్న కేటీఆర్, పారిశ్రామిక, వ్యవసాయ, సంక్షేమ రంగాల సమగ్రాభివృధ్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని ప్రధానాంశాలైన సెల్ఫ్ సర్టిఫికేషన్, 15 రోజుల్లో అనుమతులు, సింగిల్ విండో విధానాలను మంత్రి వివరించారు.
పెట్టుబడులు పెట్టండి..
టీ-హబ్లోని స్టార్టప్లను స్కేల్ అప్స్గా మార్చేందుకు అంతా సహకరించాలని మంత్రి కోరారు. టీఐఈతో పాటు సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇచ్చి కంపెనీలకు ఉద్యోగులను అందించే టాస్క్ వంటి వినూత్నమైన పథకం కేవలం తెలంగాణలోనే ఉందన్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సాఫ్ట్వేర్తో పాటు మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మేకిన్ తెలంగాణలో భాగంగా అద్భుత పారిశ్రామిక, ఎలక్ట్రానిక్ విధానాలను తీసుకొచ్చామని, తమ ప్రభుత్వ రూరల్ టెక్ విధానంతో కామారెడ్డి వంటి చిన్న పట్టణాల్లోనూ బీపీఓ సెంటర్లు ప్రారంభమవుతున్నాయని గుర్తు చేశారు. ఓ వైపు బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తూనే మరోవైపు ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ చెప్పారు.