పల్నాడులో బాబు ఫ్యాక్షనిజం

ABK Prasad Special Article On Palnadu Issue - Sakshi

రెండో మాట

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తీరు గ్రామాల్లో మరింత ఘర్షణ వాతావరణం పెంచేందుకు పనికొస్తుంది గానీ దానివల్ల ఉప యోగం ఉండదు. 10 వేల మందితో ఆత్మ కూరు (పల్నాడు) వెళ్లి ఒక గ్రామంలో రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తే దానివల్ల ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంటుంది. చలో ఆత్మకూరు కార్య క్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుగానే బాబు వ్యూహరచన చేసుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే వెంటనే దీక్షకు దిగాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని ముందే వ్యూహం సిద్ధం చేశారు. లోకల్‌ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు విపరీత ప్రచారం వచ్చేలా జాగ్రత్త తీసుకున్నారు... ప్రసార మాధ్యమాలను ఆకట్టుకుని ఒక కృత్రిమ ఉద్రిక్తతను సృష్టించు కోవడంలో బాబు విజయవంతమయ్యారు’’
– సీనియర్‌ పాత్రికేయులు సీహెచ్‌ఎంవీ కృష్ణారావు విమర్శ

ఈ వార్త చెవిని పడిన 24 గంటల్లోనే నాటి సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ప్రజాసంబంధాల ప్రధాన అధికారిగా (సీపీఆర్‌ఓ) పనిచేసిన డాక్టర్‌ విజయకుమార్‌ నుంచి మరో పిడుగు లాంటి వార్త దూసుకొచ్చింది. ‘‘2014లో చంద్రబాబు అధికారానికొచ్చినా, నాడు వైఎస్‌ జగన్‌ మీలాగా విమర్శలు చేశారా? చివరికి 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని కొంటే నాడు ప్రతిపక్షనాయకుడుగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు సరికదా, తన పాదయాత్రలో ఆ 23 మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా వాళ్లని పేరు పెట్టి విమర్శించలేదు. కానీ వైఎస్‌ జగన్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో ఎన్నుకున్న తర్వాత గత మూడునెలల వ్యవధిలోనే చంద్రబాబు తన విజ్ఞతను కోల్పోయారు. ఈ దూకుడు తగ్గించి సైకిల్‌కు రిపేర్లు చూసుకోండి’’ అని విజయకుమార్‌ సలహా ఇవ్వాల్సి వచ్చింది.

ఇలా సీనియర్‌ పాత్రికేయులు కృష్ణారావు వెలిబుచ్చిన ఆవే దనకు, విజయకుమార్‌ మాజీ సీఎం పీఆర్‌ఓగా ప్రకటించిన అసమ్మతి పత్రానికీ మరోవిధంగా లోతైన అర్థం చెప్పాలంటే చంద్ర బాబు ‘చలో ఆత్మకూరు’ ప్రయోగం ‘పల్నాటి వీరచరిత్ర’కు సంబం ధంలేని ఫ్యాక్షనిస్టు (కుట్రదారు) ప్రయోగం! చంద్రబాబు ప్రయోగం ఫ్యాక్షనిజమో కాదో తేల్చుకోవాలంటే మరొక సోషల్‌ మీడియా వార్త (14–09–2019) వెల్లడించిన విశేషాలతో కూడా పోల్చుకోవచ్చు. ఆ వార్త ప్రకారం వాస్తవాలను ‘తరకటబురకట’ (మేనేజ్‌) చేయగల నేర్పుతో తెలుగు మీడియానే కాదు జాతీయ స్థాయి ప్రసార మాధ్య మాల్ని కూడా ‘కట్టిపడవేయగల’ నేర్పరి చంద్రబాబు కాబట్టి, చలో ఆత్మకూరు నినాదంతో చేసిన  హడావుడితో నేషనల్‌ మీడియా కూడా బాబు కోసం గొలుసులు తెంచుకుని అదే రోజున పనిచేసింద’ని ఆ వార్త వెల్లడించింది. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న కాలంనుంచీ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ దాకా జాతీయ మీడియాలో కొంత భాగాన్ని రకరకాల ప్రలోభాలకు అవినీతికి బాబు అలవాటు చేస్తూ వచ్చిన దుష్ట సంప్ర దాయం సమకాలీన పాత్రికేయులకు తెలియని రహస్యం కాదు! బాబు ఇటీవల పల్నాడులోని ఆత్మకూరును పునాదిగా చేసుకుని రాష్ట్రంలో ఒక సెక్షన్‌ ప్రసార మాధ్యమాలకు తోడు జాతీయ మీడి యాలోని ఒక భాగాన్ని కూడా ప్రలోభపెట్టి కార్పొరేట్‌ రంగంలోని కొందరు దిగ్గజాలు, వారి కంపెనీలు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీకి పెట్టుబడులు రాకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేయ డాన్ని కొన్ని సోషల్‌ మీడియా మాధ్యమాలు బహిర్గతం చేయవలసి వచ్చింది. ఒక్క ఆత్మకూరులోనే కాదు, రాష్ట్రంలోనే వివిధ రూపాల్లో ఫ్యాక్షనిజా నికి తనదైన శైలిలో పాదులు తీస్తూ వచ్చిన చంద్రబాబు ఈ నెల 13–14 తేదీల్లో ఒక్కసారిగా జగన్‌ ప్రభుత్వంపై విరుచుకు పడటానికి కారకుడయ్యారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. 

పైగా విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు పెట్టుబడుల కోసం కుదు ర్చుకున్న ఒప్పందాలను జగన్‌ ముఖ్యమంత్రిత్వం లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరగతోడవలసి వచ్చినందుకు ఈ కొన్ని పత్రి కలు తమ సంపాదకీయాల్లో ఆయుధాలు ఎక్కుపెట్టిన మాటా వాస్త వమే. పారదర్శకత ప్రశ్నార్థకంగా మారిన ఈ విద్యుత్‌ ఒప్పందాల వల్ల, ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోళ్ల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, తద్వారా విద్యుత్‌ వినియోగదార్లపైన భారీగా భారం పడుతు న్నందున– ఆ ఒప్పందాలను తిరగదోడవలసి వస్తోందన్నది దాగని సత్యం. అందువల్ల ఈ అనర్థపు ఒప్పందాల్ని పునఃసమీక్షించుకోవా లన్న నిర్ణయాన్ని కూడా విమర్శిస్తూ కొందరు ‘జాతీయ జర్నలిస్టులు’ ఖండించటం కార్పొరేట్‌ ప్రయోజనాలను కాపాడటానికా, ప్రజా ప్రయోజనాలను రక్షించడానికా అనేది అర్థం కావటం లేదు. 

గత బాబు పాలనలో ప్రలోభాలకు లోను అయినందువల్లనే కొన్ని స్థానిక, జాతీయ స్థాయి పత్రికలు, కొందరు జర్నలిస్టులు దిగజారిపోవలసి వచ్చింది. ఇందుకు పక్కా ఉదాహరణగా– మన రాష్ట్రంలోని కొన్ని తైనాతీ దినపత్రికలు, కాదు కాదు.. జాతీయ స్థాయి అగ్రేసర పాత్రికేయుడైన ఎ.ఎన్‌. సాహనీ మాటల్లో చెప్పాలంటే కొన్ని ‘ఉంపుడు పత్రికలు’ (కెప్ట్‌ ప్రెస్‌), ఆ జాతీయస్థాయి పత్రికలు ప్రలో భాల మత్తులో జగన్‌ ప్రభుత్వంపై నెగెటివ్‌గా రాసిన సంపాదకీ యాల్ని ఉటంకించి ఉండేవీ కావు, వాటి ఆధారంగా ఆ మరుసటి రోజున కథనాలు అల్లి ఉండేవీ కాదు. పైగా ఆ ఆంగ్ల పత్రికల్లో జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్పొరేట్‌ రంగ ప్రయోజనాలకు వత్తా సుగా వచ్చిన సంపాదకీయాలను తెలుగులోకి అనువదించి ఆ ‘పచ్చ’ మీడియా (15వ తేదీ) ప్రచురించి ఉండేదీ కాదు. కారణం– నేషనల్‌ మీడియాను సాకింది వారే కనుక. 

ఈ చిచ్చులో అంతర్భాగమే బాబు వర్గం నడిపిన సొంత దొంగ బాధితుల లేదా ‘అద్దె’ బాధితుల శిబిరం, ‘గరుడ శివాజీ’ నుంచి మొదలుపెట్టి ఆత్మకూరులో ‘అద్దె ఆర్టిస్టుల’ శిబిరం దాకా దేకుతూ వచ్చింది. బయటి వారిని శిబిరంలో కూర్చోబెట్టడం కోసం ముద రాగా రూ. 10 వేలు ఇస్తామని ఆశ చూపి మరీ శిబిరానికి చేర్చారని ఆ ‘బిర్యానీ బాధితులే’ స్వయంగా పత్రికల వారి ముందు ‘వాంగ్మూ లమివ్వ’డం బాబు దాచలేని ‘చలో ఆత్మకూరు’ రహ స్యంగా.. సోషల్‌ మీడియా కోడై కూసింది. ఇందుకు పిడుగురాళ్లవాసి నరసింహారావు, పిన్నెల్లి గ్రామవాసి కొమ్ము ఏసుబాబుల ప్రకటనలే సాక్ష్యం. చివరికి ఎక్కవలసిన బస్సు మిస్సయిన ప్రయాణీకుల్ని సహితం వదలకుండా లాక్కొచ్చి శిబిరంలో కూర్చోబెట్టారంటే బాబు వర్గీయులు ఎంతకైనా తెగించగలరని అర్థమవుతుంది. 

నిజానికి 12వ శతాబ్ది నాటి పల్నాటి యుద్ధం కూడా బలిసిన రెండు వర్గాల మధ్య రాజ్య విస్తరణ కోసం ‘కోడిపందేల’ చాటున జరిగిన కుమ్ములాటల ఫలితమే. ఎందుకంటే ఆనాటి అసలు పోరంతా రెండు మతాల మధ్య సాగిన ఘర్షణల పర్య వసానమే. శైవ, వైష్ణవ మత తగాదాల మధ్య వైష్ణవ మతావలంబిగా బ్రహ్మనాయుడికీ, శైవ మతావలంబిగా నాగమ్మకు మధ్య జరి గిన సాయుధ సంఘర్షణకు నోరులేని కోళ్లను ‘పందాల’ రూపంలో బలితీసుకున్నారు. ఆ మాటకొస్తే ‘ఉరుమురిమి మంగళంమీద పడిన’ చందంగా హేతువాద దీపిక శిఖగా వర్ధిల్లుతూ వచ్చిన సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన బౌద్ధ ధర్మం వినాశనానికి పల్నాటి యుద్ధ కాలంలోనే శైవ–వైష్ణవాలు కత్తులు దూశాయని మరవరాదు. ఈ యుద్ధంలోనే బడుగు, బలహీన బహుజనాలు ఆబోతుల ఘర్షణ మధ్య లేగదూడలు నలిగి నశించినట్టు, పల్నాటి యుద్ధంలో కూడా నేలకొరిగిన అసంఖ్యాకులు దళిత జాతులు, అమాయకులేనని మర చిపోరాదు. నాడే కాదు, నేడు కూడా పల్నాడులోని మాచెర్ల, గుర జాల, కారెంపూడి ఉత్సవాలు పేరుకు వీరుల ఉత్సవాలుగా జరుపు కొంటూ వస్తున్నా కుల, మత, వర్గ, వర్ణ సంఘర్షణల్లో దఫదఫాలుగా నేలకొరుగుతున్నవారు బడుగు, బలహీన, బహుజన వర్గాలేనన్నది అదే పల్నాటిలోని ఆత్మకూరు ఉదంతాలు కూడా నిరూపిస్తున్నాయి. నాడు రాజ్య విస్తరణ కోసం దళిత బహుజనాల్ని (గోసంగుల్ని) రాచ రికంతో యుద్ధాల్లోకి దించారు. శైవ, వైష్ణవ తగాదాల మధ్య బౌద్ధారా మాలు, చైత్యాలు ధ్వంసమైనప్పుడూ నలిగి నుగ్గయిపోయిన వాళ్లలో దళితులూ బహుళ సంఖ్యలో ఉన్నారని చరిత్రకారుల అభిప్రాయం. 
కానీ, చరిత్ర పాఠాలు పిల్లలకు బోధించకూడదని ఒకనాడు శాసించిన చంద్రబాబు ఈ పల్నాటి చరిత్రనుంచి గ్రహించవలసిన మంచి పాఠాన్ని కూడా మరిచిపోయి మరో రూపంలో ‘చలో ఆత్మ కూరు’ పేరిట పల్నాటి యుద్ధాన్ని గుర్తుకు తెస్తున్నారు.

తాను చేయ బోయే వక్ర విన్యాసాలకు జీవితాంతం ఇప్పటిదాకా ఆయన నిర్వాకం చేస్తున్నది– చరిత్ర వక్రీకరణ మాత్రమే. బాలచంద్రుడు ఇష్టపడిన శ్యామాంగి (సుబ్బాయి) ఒక దళిత బిడ్డ. కానీ ఆమె తల్లి అంటుంది– ‘అయ్యా బాలచంద్రా! మేము సరిసమానులతో చెలిమి చేయగలం. కానీ అలవికాని సంపన్నులతో మాకు పొత్తు మంచిదికాదు. తగిన వాడు మాకు దొరికితే చేనుకి కాపుగా ఉన్నట్టు, చెప్పినట్టు వింటాడు. ముక్కుకు తగిన ముత్యం అందమైనట్టు ఎవరికి తగినవాడే వారికి అందం. నాయనా, బాలచంద్రా కలవారి పొందు కడదాకా ఉండదు’ అన్న ఆ తల్లి మాటల వెనుక అర్థాన్ని తెలుసు కోగలిగిన వారికి.. నేటి ఆత్మకూరులో భూములు, పనులు సంపన్నుల దాష్టీకాల మధ్య కోల్పోయి, ‘పొట్ట’ చేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు రక్షణ కోసం ఉరుకులు, పరుగులు పెట్టవలసి రావటం ఎలాంటి ప్రజాస్వామ్యమో చంద్రబాబు, ఆయన వర్గీయులు చెప్పగలగాలి. ప్రసార మాధ్యమా లను ఆయన తన స్వార్థంకొద్దీ ఇన్నేళ్లూ ఎంతగా భ్రష్టుపట్టిస్తూ వచ్చిందీ గతంలో ‘డైలీ టెలిగ్రాఫ్‌’ (కలకత్తా) దినపత్రిక, ‘బ్లిట్జ్‌’ (బొంబాయి) వారపత్రిక ప్రలోభాలకు లోనైన జర్నలిస్టుల పేర్లతో సహా బహిర్గతం చేసిన సంగతిని అప్పుడే బాబు మరిచిపోయారా? ఇకనైనా కదిలించకండి అజ్ఞాత జ్ఞాపకాల తుట్టిని. కాలం కలిసి రాన ప్పుడు కార్పొరేట్‌ శక్తులు సహితం తనతో కలిసిరారు!!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top