మన నీటికథలు... | our water stories | Sakshi
Sakshi News home page

మన నీటికథలు...

Mar 30 2015 11:45 PM | Updated on Sep 2 2017 11:36 PM

మన నీటికథలు...

మన నీటికథలు...

2003 జూన్‌లో హైదరాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ నగరంలోని జలాశయాలపై ఒక సదస్సును ఏర్పాటు చేసింది.

2003 జూన్‌లో హైదరాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ నగరంలోని జలాశయాలపై ఒక సదస్సును ఏర్పాటు చేసింది. నగరం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు కారణం జలాశయాలను నిర్వహించడంలో వైఫల్యమేనని సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియాలో మనలాంటి ఇతర వర్ధమాన దేశాల్లో నీటి నిర్వహణలో విచిత్రస్థితి ఉంది. ఎప్పటికప్పుడు చేయాల్సిన రొటీన్ పనులను పెండింగ్ పెడతారు. మరోవైపు నీటి కోసం కొత్తకొత్త పథకాలను భారీ బడ్జెట్‌లతో ప్రవేశపెడతారు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యాలు క్షీణింపజేయడంలో అభివృద్ధిని సాధిస్తున్నాం!
 
విద్యుత్ ప్రాజెక్ట్‌లనే చూడండి. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రతిబంధకాలను తొలగించేందుకు చేసే ప్రయత్నం కంటే కొత్తవాటిని నిర్మించడం లేదా అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి పెడతాం. నీటి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏ పూటకాపూట చేయాల్సిన పనులను పక్కన పెడతాం. వేళ్లపై లెక్కించదగ్గ మంచినీటి వనరులలో చెత్తాచెదారం, ప్లాస్టిక్, రసాయనాలు పడకుండా పర్యవేక్షించే సిబ్బందిని నియమించం. అంగుళం అంగుళం అదృశ్యమవుతుంటే కళ్లు తెరవం! మన నిర్లక్ష్యం ఒక ముప్పుగా మారే వరకూ అటువైపు చూడం.

ఒక్కసారి ‘విపత్తు’ రూపం తీసుకుందా? ‘ఎమర్జెన్సీ’ని ఎదుర్కొనేందుకు ఉరుకులు పరుగులు పెడతాం! ఎందుకిలా? రోజువారీ పని చేయడంలో గుర్తింపేముంది ?. సంక్షోభాన్ని నివారించిన వారే కదా హీరోలు! సంక్షోభాన్ని పరిష్కరించిన ఈ ‘హీరో’నే ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు చేయకుండా అలసత్వం చూపి సంక్షోభానికి కారకుడయ్యాడు అనే ఎరుక ప్రజలకు ఉండదు కదా! కాబట్టి ప్రతి సహజక్రియనూ అత్యవసర పరిస్థితికి చేర్చడం.. ఓట్ల రాజకీయాల్లో ఓ కళగా వృద్ధి చెందుతోంది!
 
ఈనాటి ఉద్యానవనం..
నింగిలోని మబ్బులను తారకలను ప్రతిఫలించే స్వచ్ఛమైన జలాశయాలు ఎలా కనుమరుగవుతున్నాయో ఒక ఉదాహరణ. బంజారాహిల్స్‌లోని వెంగళరావు పార్క్‌ను అట్టహాసంగా ఆ మధ్య ప్రారంభించారు కదా. ఆ పార్క్ గురించి వాస్తవాలు కనుమరుగయ్యాయి. ఒక చనిపోయిన చెరువుపై ఆ పార్క్‌కు పురుడు పోశారు. కళకళలాడే చెరువును భూ కబ్జాదారులు ఆక్రమించుకుని క్రమంగా చెరువనేది లేకుండా చేసి పార్కును నిర్మించారు. మాసాబ్‌ట్యాంక్ అలానే అంతరించిపోయింది. ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలింది!
 
తలకిందుల ప్రాధాన్యాలు!
హుడా వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడు సోమ్‌పాల్ వివరణ వినండి. పదో పంచవర్ష ప్రణాళికలో 98,900 కోట్ల రూపాయలు టెలికమ్యూనికేషన్స్‌కు కేటాయిస్తే నీటి పారుదలకు 3,300 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు.
 
9వ ప్రణాళికలో టెలికమ్యూనికేషన్స్‌కు 92,600 నీటి వనరులకు 1,955 కోట్లు కేటాయించారు. దప్పికతో అంగలార్చుకుంటోన్న ప్రజలకు కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పరచడం ముఖ్య అవసరంగా భావిస్తున్నామన్నమాట! సిటీలో చెరువులను ప్రైవేట్‌కు అప్పజెప్పే ప్రతిపాదనా ఆ వర్క్‌షాప్‌లో ప్రస్తావనకు వచ్చింది. ‘చెరువు’ అంటే అందరిదీ అనే భావన ఏర్పడింది. అందరి మేలుకు ఎలా ఉపకరిస్తుందా అని కాకుండా గుడిసె వేసుకునేందుకు, ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేందుకు తహతహలాడే స్వభావం కారణంగా చెరువులు అదృశ్యమైపోతున్నాయి. ఇప్పుడు కావాల్సింది ప్రైవేటేజేషన్ కాదు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పటిష్టమైన ప్రభుత్వ నిర్వహణ!
 
చమురు యుద్ధాలు గతం!
గతంలో ప్రజలు అన్నం లేక కరువుతో చనిపోయారు. కరువు కాటకాలు నియంతృత్వ పాలనలోకి వస్తాయని ప్రజాస్వామ్య దేశాల్లో రావని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. ఆయన లాజిక్ ప్రకారం కనీస ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆహారలేమితో ప్రజలు చనిపోయే దుస్థితి వస్తే ప్రభుత్వాలకు అస్తిత్వ సమస్య ఏర్పడుతుంది. తమ మనుగడ కోసమైనా డొక్కలకరువులు రాకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాపాడతాయి.

బాగానే ఉంది. కాని ప్రజాస్వామ్యదేశాల్లో పొంచి ఉన్న కరువు తిండికి సంబంధించినది కాదు. నీటికి సంబంధించినది. ప్రపంచంలోనే ఎత్తయిన హిమ శిఖరం తలమానికంగా ఉన్న దేశంలో నీటికి కరువు రాబోతుంది. గొంతు తుడుపుకొనేందుకు మంచినీళ్లకు దిక్కులేని దుస్థితి దాపురించనుంది.
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement