కన్నీళ్లకు పదేళ్లు | ten years completed by japan sunami | Sakshi
Sakshi News home page

కన్నీళ్లకు పదేళ్లు

Dec 25 2014 11:12 PM | Updated on Sep 2 2017 6:44 PM

కన్నీళ్లకు పదేళ్లు

కన్నీళ్లకు పదేళ్లు

పదేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. 2004 డిసెంబర్ 26. ఆదివారం సెలవు దినం కావడంతో విశ్రాంతిగా సేదతీరుతూ... టీవీ చూస్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

26.12.2004 సునామీ: దశాబ్దపు దుఃఖం
 
పదేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. 2004 డిసెంబర్ 26. ఆదివారం సెలవు దినం కావడంతో విశ్రాంతిగా సేదతీరుతూ...  టీవీ  చూస్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సముద్రంలో భూకంపం అని బ్రేకింగ్ న్యూస్. అప్పుడు సమయం ఉదయం 7.30 గంటలు. ఈ ఉపద్రవం ఎక్కడోకాదు, మననే చుట్టుకోనుందని తెలుసుకునేందుకు వారికి ఎంతో సేపు పట్టలేదు. అప్రమత్తం అయ్యేలోపునే ఆవలి ఒడ్డున ఉన్న సముద్రుడు ఈవలి ఒడ్డున ఉన్న నివాసగృహాలను కబళించివేశాడు. పట్టుచిక్కేలోపునే ప్రజల ప్రాణాలను హరించివేశాడు. నిండైన కుటుంబాలు సునామీ అనే శోకసంద్రంలో మునిగిపోయాయి. భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, మాల్దీవులు, సోమాలియాలపై సునామీ బలంగా విరుచుకుపడింది. మొత్తం 14 దేశాల్లో సుమారు 2లక్షలా 30 వేల మందిని బలిగొంది. భారతదేశంలో సునామీ ప్రభావానికి ఎక్కువగా కకావికలమైంది తమిళనాడు మాత్రమే. తమిళనాడులో 1700 మందిని సునామీ కాటువేయగా, ఒక్క చెన్నై నగర పరిధిలోనే 131 మంది ప్రాణాలను హరించివేసింది. ఇందులో కూడా ఒక్క శ్రీనివాసపురంలోనే 52 మంది రాక్షస అలలతాకిడికి బలైపోయారు. సునామీ పొట్టనపెట్టుకున్న వారితో తమకున్న తీపి జ్ఞాపకాలను  గత పదేళ్లుగా ప్రతి క్రి స్టమస్ పండుగ మోసుకొస్తోంది. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఈనాటికీ మృతుల కుటుంబాలను వీడలేదు.
 కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై
 
ఒకే కుటుంబంలో ముగ్గురిని మింగిన రక్కసి

 
చెన్నై మెరీనాబీచ్ సమీపంలో శ్రీనివాసపురంలో వీ సెల్వమణిది చిన్న కుటుంబం. భార్య, నలుగురు కుమార్తెలు, అత్తగారు. ఆ రోజు... ప్రపంచంలో ఎక్కడో భూకంపం వస్తోందనే టీవీ వార్తలను కుటుంబమంతా కలిసి చూస్తున్నారు. ఇంతలో బైట నుండి కేకలు వినిపించడంతో అందరూ ఇంటి వాకిట్లో నిలబడ్డారు. ఇంటికి అరకిలోమీటర్ల దూరంలో ఉండే సముద్రపు నీరు అప్పటికే వారి కాళ్లపాదాలను తాకుతోంది. అసలు ఏమి జరుగుతోందో తెలిసేలోగా రెప్పపాటులో ఐదు అడుగుల ఎత్తుకు నీరు చేరింది. ముగ్గురు కుమార్తెలను సెల్వమణి ఒడిసిపట్టుకుని కొంతదూరం కొట్టుకుపోయాడు. ఇంతలో సముద్రపు అలల్లో దొర్లుకుంటూ వచ్చిన పెద్ద రాయి సెల్వమణి కాలికి బలంగా తగలడంతో కుమార్తెలు చేజారారు. సెల్వమణి సైతం బురదలో కూరుకుపోయారు. మార్గమధ్యంలో చిక్కిన ద్వారబంధనంతో సెల్వమణి బైట పడ్డాడు. ముగ్గురు కుమార్తెలు ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు. అయితే అత్త పాలయమ్మ (70), భార్య రాజేశ్వరి (45), కుమార్తె రమణి (25)లను సునామి బలితీసుకుంది.

మూడురోజుల తర్వాత శవాలు: సెల్వమణి

‘‘సముద్రపు నీరు వెనుదిరగానే ముగ్గురు కుమార్తెలు క్షేమంగా నా దగ్గరకు వచ్చారు. మా ఇంటికి సమీపంలోని అక్క ఇంటిలో తలదాచుకున్న నా భార్య అక్కడే ప్రాణాలను వదిలింది. అత్త, పెద్ద కుమార్తె కనపడక పోవడంతో అన్నిచోట్లా వెతికాను. మృతదేహాలు లభ్యం కాకపోవడంతో ఎక్కడో క్షేమంగా ఉంటారులే అనుకున్నాను. అయితే మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో పరిసరాల్లో వెతికి చూస్తే, రెండు ఇళ్ల మధ్యన ఉన్న ఇరుకు సందులో అత్త, కూతురు ఒకరిచేతులు ఒకరు పట్టుకున్న రీతిలో మృతజీవులుగా పడి ఉండడం కనిపించింది’’ అని సెల్వమణి కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
కుటుంబాన్ని రక్షించబోయి...


 ‘భూకంపం వస్తోందంట, మిద్దెపై నుండి బయటకు రాండి’ అంటూ తన భర్తను, పిల్లలను కాపాడాలని ఆమె హృదయం తపించిపోయింది. వస్తున్నది భూకంపం కాదు, సునామీ అనే భూతం అని గుర్తించేలోపే ఆమె కాలగర్భంలో కలిసిపోయింది. పీఎస్ చెల్లప్పన్, రత్న (60) దంపతులకు ఇద్దరు కుమారులు. వారితోనే కోడలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, తమ్ముడిని, భార్య మిని, కుమార్తె వినితను పోషించే బాధ్యత పెద్ద కుమారుడైన అనిల్‌కుమార్‌ది. ఆరోజు ఆదివారం కావడంతో సముద్రపు ఒడ్డున అమ్మే అరుదైన రకం చేపలను కొనేందుకు రత్న, మిని వెళ్లారు. చేపలు బేరం అడుతున్న సమయంలో కంటికి ఎదురుగా కనిపించే సముద్రంలో అలలు ఎగిసిపడటం, స్థానికులంతా భూకంపం అని భయకంపితులు కావడంతో ఇద్దరూ ఇంటివైపు పరుగులు పెట్టారు. ఇంటి పరిసరాల్లో దట్టమైన ఇసుక, మట్టీ పేరుకుపోవడంతో వృద్దురాలైన రత్న వేగంగా ముందుకు సాగలేకపోయారు. ‘ఇల్లు కూలుతుందేమో బయటకు వచ్చేయండీ’ అంటూ భర్తను, ఇద్దరు కుమారులను ఆమె హెచ్చరిస్తున్న దశలోనే రెండు అలలు ఆమెను చుట్టుముట్టేశాయి. మూడోసారి వచ్చిన బలమైన అల ఆమెను నిలువులోతు నీళ్లలో ముంచేసింది. అత్త పక్కనే ఉండిన కోడలు మిని అతి కష్టంమీద నిలదొక్కుకుని ప్రాణాలు దక్కించుకుంది. తనకు అండాదండగా ఉన్న భార్యను సునామీ మింగేయడంతో కృంగిపోయిన చెల్లప్పన్ కొద్దికాలంలోనే కన్నుమూశాడు.
 
అమ్మజ్ఞాపకాలు పదిలం: అనిల్‌కుమార్

మమ్మల్ని కాపాడాలనే తాపత్రయంలో అమ్మ తన ప్రాణాలను కోల్పోయిందని తలచుకున్నపుడల్లా మేము తల్లడిల్లిపోతాము. తమ్ముడు ఉదయాన్నే చర్చికి, అమ్మ, భార్య చేపల కోసం పోయివున్నారు. నాన్న, నేను మాత్రమే ఇంటిలో ఉన్నాము. కాలుకదపలేని స్థితిలో నాన్న ఇంటిలోనే ఉండిపోగా, నేను మాత్రం మిద్దెపై నుండి కిందకు వచ్చాను. సముద్రపు అలలతో ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్ మునిగిపోయింది. నేను కూడా నీళ్లలో కొట్టుకుపోతూ మధ్యలో కరెంటు స్తంభం పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాను. అమ్మ కొట్టుకుపోతుంటే, 15 ఏళ్ల నా కుమార్తె కాపాడే ప్రయత్నం చేసింది. నీటి మట్టం తగ్గిన తరువాత చూస్తే అమ్మ శవం అడుగున పడి ఉంది. డిసెంబరు వస్తే చాలు.. అమ్మ గుర్తుకు వచ్చి గుండె అంతా దిగులవుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement