
కలం, కెమెరాలే... ఆమె ఆయుధాలు
ఇక్కడ రైలుపట్టాల మధ్యలో కెమెరా పెట్టిన అమ్మాయి పేరు లిసా బయాజిగోట్టి. ఒక చేత్తో కలాన్ని, మరో చేత్తో కెమెరా పట్టుకుని బయలుదేరే ఈ అమ్మాయి వృత్తిరీత్యా పాత్రికేయురాలైనప్పటికీ రాసిన ప్రతి అక్షరాన్ని ప్రజల కళ్లముందుంచడానికి దర్శకురాలి అవతారమెత్తింది.
ఇక్కడ రైలుపట్టాల మధ్యలో కెమెరా పెట్టిన అమ్మాయి పేరు లిసా బయాజిగోట్టి. ఒక చేత్తో కలాన్ని, మరో చేత్తో కెమెరా పట్టుకుని బయలుదేరే ఈ అమ్మాయి వృత్తిరీత్యా పాత్రికేయురాలైనప్పటికీ రాసిన ప్రతి అక్షరాన్ని ప్రజల కళ్లముందుంచడానికి దర్శకురాలి అవతారమెత్తింది. ఆమె చెప్పే ప్రతి కథా విని సినిమాలు నిర్మించడానికి ఎవరైనా ముందుకొస్తారో రారో అని తనే నిర్మాత అవతారం కూడా ఎత్తింది. ఉత్తర అమెరికాకి చెందిన లిసా గ్రామీణ అమెరికాపై ‘డీప్సౌత్’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించి అందరి ప్రశంసలూ అందుకుంది.
ఈ డాక్యుమెంటరీలో ఓ నలుగురు ఉత్తర అమెరికా గ్రామీణులు సంప్రదాయ విలువలతో బతకడానికి సృష్టించుకున్న సొంత విధానాల గురించి ఆసక్తికరమైన అంశాలున్నా ఇందులో భాగంగానే హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి గ్రామీణ ప్రజలకున్న అవగాహన గురించి కూడా ఉంది. డీప్సౌత్కి ముందు కాంగో దేశం సంక్షోభం గురించి లిసా తీసిన షార్ట్ఫిల్మ్ కూడా సంచనాలు సృష్టించింది. అలాగే ఇటలీకి వలసొచ్చే ముస్లింల మనుగడపై నిర్మించిన డాక్యుమెంటరీ లిసాలోని పరిశోధకురాలిని బయటపెట్టింది.
కొలంబియా యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన లిసా మొదట లాస్ఏంజెల్స్ టైమ్స్లో, పిబిఎస్, కరెంట్ టివి అండ్ హ్యూమన్ రైట్స్ వాచ్లో రిపోర్టర్గా పనిచేసింది. ఒక పక్క వార్తా కథనాలు రాస్తూ మరో పక్క ఆ కథనాలపై కెమెరా కన్ను పెట్టి డాక్యుమెంటరీలు నిర్మించడం లిసా ప్రత్యేకత. వీటితో పాటు తన కంట పడ్డ సామాజిక సమస్యల గురించి ప్రసంగాలు ఇస్తుంది లిసా. ఆమె తన బాధ్యతను కలం కృషితో సరిపెట్టకుండా రకరకాల దారుల్లో ప్రజలకు అవగాహన పెంచుతూ, సమస్యలకు పరిష్కారాలు వెతుకుతోంది.