‘సప్తపది’లోని అర్థం... పరమార్థం...
ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహబంధం. మాంగల్యధారణ తర్వాత వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపది అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతి అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.
‘‘ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. నువ్వు నా స్నేహాన్ని విడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసులతో జీవిద్దాం. ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’’ అంటాడు వరుడు.
అప్పుడు వధువు ఇలా అంటుంది..
‘‘ఓ ప్రాణమిత్రుడా! నువ్వు ఆకాశమైతే నేను భూమి. నువ్వు మనసైతే నేను మాటను. నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే రుత్వికుడివి. మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్టసుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’’ అంటుంది.
‘‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధి కోసం, మనకు ఉత్తమస్థితి కలగటం కోసం, బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులైన వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానాన్ని అందించు’’ అని వరుడు చెబుతాడు.
‘‘నీ సహధర్మచారిణిగా అది నా కర్తవ్యం’’ అంటుంది వధువు.
ఆ తరువాతే వారిరువురూ గృహస్తధర్మానికి అర్హులవుతారు. అదీ సప్తపదిలోని అంతరార్థం.