భార్యను హత్య చేసిన కేసులో చక్రాయపేట మండలం నాగులగట్టుపల్లె గ్రామానికి చెందిన శివరామ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చక్రాయపేట: భార్యను హత్య చేసిన కేసులో చక్రాయపేట మండలం నాగులగట్టుపల్లె గ్రామానికి చెందిన శివరామ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. శివరాం తన సొంతూరు రాయచోటిలోని మాసాపేటలో నివాసముండేవాడు. 8 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ఆదినారాయణ కుమార్తె శివమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే ఇతని భార్య విలాసవంతమైన జీవితం గడపాలని అప్పుడప్పుడు ఇతన్ని ఒత్తిడి చేసేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం నాగులగట్టుపల్లెలో ఓ సినిమా థియేటర్లో మేనేజర్గా చేరాడు. సంసారం కూడా అక్కడే పెట్టారు. శివమ్మ కోరిక మేరకు కొంత బంగారం, కారు కూడా కొనుగోలు చేశాడు. ఈ మధ్యకాలంలో అతను పనిచేసే సినిమా థియేటర్ను లీజుకు తీసుకోగా భారీ నష్టాలు వచ్చాయి. దీంతో తన భార్య బంగారును తాకట్టు పెట్టాడు. తర్వాత భార్య శివమ్మ తన బంగారం తెచ్చి ఇవ్వాలని పదే పదే అడిగేది. ఈనెల 8వ తేదీ కూడా అదే తరహాలో ఒత్తిడి చేయడంతో అతను ఇంటి నుంచి థియేటర్కు వెళ్లి రాత్రి ఇంటికి వెళ్లలేదు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి వెళ్లేసరికి అతని భార్య పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. వారిద్దరి మధ్య గొడవ జరిగి శివమ్మ శరీరంపై ఉన్న చున్నీతో గొంతుకు ఉరివేసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు మళ్లీ సినిమా థియేటర్కు వచ్చి సినిమా వేసి ఇంటికి వెళ్లాడు. తన భార్య ఉరి వేసుకొని చనిపోయిందని చుట్టు పక్కల వారికి చెప్పి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ను కూడా పిలిపించాడు. రాయచోటికి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వాహనంలో రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. మృతురాలి సోదరుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భార్యను తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ పుల్లయ్య, ఎస్ఐ గోవిందు తెలిపారు.