కౌన్సిలర్ ఉపఎన్నిక ఏకగ్రీవం
తణుకు : తణుకు పురపాలక సంఘం 3వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుబ్బల నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.
తణుకు : తణుకు పురపాలక సంఘం 3వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుబ్బల నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కౌన్సిలర్ పదవికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా శనివారం నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్దృష్టికి తీసికెళ్లిన అనంతరం ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌరు వెంకటేశ్వర్లు, గుబ్బల నాగలక్ష్మి, టీడీపీ నుంచి గుబ్బల శ్రీనివాసు, పంపన నాగపద్మారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పంపన సుబ్బారావు తమ నామినేషన్పత్రాలను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో చర్చలు జరిపి ఆయన అంగీకారం తీసుకున్నారు. మృతి చెందిన గుబ్బల రామారావు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేస్తే ఏకగ్రీవానికి సహకరిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడిన కారుమూరి నామినేషన్ల ఉపసంహరణకు అంగీకారం తెలిపారు. ఎన్నికైన గుబ్బల నాగలక్షి్మని కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మునిసిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తదితరులు అభినందించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : కారుమూరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి కౌన్సిలర్ ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి తమ వంతు సహకారం అందించామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ గుబ్బల రామారావు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేస్తే తాము ఏకగ్రీవానికి సహకరిస్తామని గతంలో మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని చెప్పారు. తమ పార్టీ నుంచి నామినేషన్లు సమర్పించిన గుబ్బల నాగలక్షి్మకి 3వ వార్డు ఇన్చార్జిగా బాధ్యతలతో పాటు పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్టు కారుమూరి ప్రకటించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారామ్, పట్టణ గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాసు, మహిళా అధ్యక్షురాలు గుర్రాల నాగేంద్ర, సీడీసీ చైర్మన్ బోడపాటి పాల్గొన్నారు.