
200 ఏళ్ల కిందటి తాళపత్ర గ్రంథాలు లభ్యం
ప్రకాశం జిల్లాలో 200 ఏళ్ల కిందటి రెండు తాళపత్ర గ్రంథాలు లభించాయి.
అద్దంకి: ప్రకాశం జిల్లాలో 200 ఏళ్ల కిందటి రెండు తాళపత్ర గ్రంథాలు లభించాయి. జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో ఇవి లభించినట్లు తాళపత్ర గ్రంథ పరిశోధకుడు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి తెలిపారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేసి రిటైరయిన మర్రి గురవయ్య ద్వారా ఇవి వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
వీటిలో ఒకటి కాటమరాజు సేనాని వలరాజు చరిత్ర అని, మరొకటి కాటమరాజు యుద్ధం జరిగిన తీరును తెలిపే గ్రంథమని వివరించారు. ఈ గ్రంథాలు రెండూ తెలుగు భాషలో, ద్విపదలో రాశారని చెప్పారు. వలరాజు చరిత్ర గ్రంథం 250 ఏళ్లనాటిదని, యుద్ధాన్ని వర్ణించే గ్రంథం 300 ఏళ్లనాటిదని తెలుస్తోందని వివరించారు. వీటికి శుద్ధ ప్రతిని తయారుచేసి చరిత్ర పరిశోధకులకు పంపుతామన్నారు. ప్రస్తుతం గంగ దొనకొండగా చెప్పబడుతున్న ప్రాంతాన్ని తన స్థావరంగా ఏర్పరచుకున్న కాటమరాజు పాలేటి గంగకు వెళ్లిన విధానం, నెల్లూరు మనుమసిద్ది ఆస్థాన ప్రాంతంలోకి ఆవులను మేపుకోవడానికి వెళ్లిన సమయంలో జరిగిన యుద్ద కథతోపాటు, ఆయన సైన్యాధ్యక్షుల్లో ఒకరైన వలరాజు చరిత్రను విపులంగా రాశారని చెప్పారు.
ఈ గ్రంథాల్లోని ఆకుల్లో రెండు వైపులా ఆరు వరుసల్లో చరిత్ర రాశారన్నారు. గణగణ గంటలు మోగంగా.. ఘన వాయిద్యములతో, కనకతప్పెటలతో పశుపతి రాజులనే వర్ణనతో యుద్ద కథ ప్రారంభమైందని చెప్పారు. ఈ గ్రంథాల్లోని ఆకులపై ఉన్న అక్షరాలు బయటకు వచ్చేలా చేసి నెల రోజుల్లో శుద్ధ ప్రతిని తయారు చేస్తామని చెప్పారు. దీని ద్వారా గతంలో దొరికిన గ్రంథాల్లోకన్నా, కాటమరాజు చరిత్రలో అదనంగా మరికొన్ని ముఖ్య ఘట్టాలు తెలిసే అవకాశం ఉందన్నారు.