రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి.
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచననూ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సంఘాల నేతలు పోరుకు దిగారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్న సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు మెరుపు వేగంలో జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకుని సమావేశం మందిరంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపు విద్యార్థి సంఘాల నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి నేతలు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పెదకూరపాడు, వేమూరు ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు సమావేశ మందిరంలోకి వెళుతున్న క్రమంలో విద్యార్థి నేతలు వారిని అడ్డుకున్నారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుంటూ జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని వారు డిమాండ్చేశారు.
కనీసం విద్యార్థి సంఘాల నేతలను వినతిపత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. ఆడపిల్లలు ఉన్నారన్న కనికరం లేకుండా పోలీసులు వారిని అక్కడ నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య మరోమారు తోపులాటలు జరిగాయి. బలవంతంగా వారిని అరెస్ట్చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘాల నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బాని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. భగవాన్దాస్లతోపాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.