
అక్రమ దాడులు ఆపండి
వాణిజ్య పన్నులశాఖ తమపై జరుపుతున్న అక్రమ దాడులను ఆపాలని ట్రాన్స్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నిసార్జాన్ డిమాండ్ చేశారు. లేకుంటే నవంబరు 1న జిల్లా బంద్ చేపడతామని హెచ్చరించారు.
కడప రూరల్:
వాణిజ్య పన్నులశాఖ తమపై జరుపుతున్న అక్రమ దాడులను ఆపాలని ట్రాన్స్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నిసార్జాన్ డిమాండ్ చేశారు. లేకుంటే నవంబరు 1న జిల్లా బంద్ చేపడతామని హెచ్చరించారు. ఆ మేరకు ఈనెల 15వ తేదిన కార్యచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలంటే కేంద్రాన్ని అడగాలేగానీ తమపై పడి వసూళ్లను రాబట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పన్నులు చెల్లించలేక ట్రాన్స్పోర్టులను నిర్వహించలేక ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు వాణిజ్య పన్నులశాఖ వారు ప్రభుత్వానికి రాబడి ఇచ్చే క్రమంలో తమపై పెనాల్టీలు వేయడం దారుణమని వాపోయారు. తమవద్ద వే బిల్లులు ఉన్నప్పటికీ, లేనప్పటికీ లక్షల్లో జరిమానాలు విధించడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జీఎల్టీ, సూర్య, తిరుమల ట్రాన్స్పోర్టు అధినేతలు జంషీర్, చైతన్య, రమేష్బాబు, హరినాథరెడ్డి, రమేష్రాజు తదితరులు పాల్గొన్నారు.