వేతనాలు ఎగవేసిన సౌదీ కంపెనీలు | soudi campanies not giving salaries | Sakshi
Sakshi News home page

వేతనాలు ఎగవేసిన సౌదీ కంపెనీలు

Aug 3 2016 11:28 PM | Updated on Sep 4 2017 7:40 AM

వేతనాలు ఎగవేసిన సౌదీ కంపెనీలు

వేతనాలు ఎగవేసిన సౌదీ కంపెనీలు

సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా మన ప్రాంత కార్మికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

  • ఎనిమిది, తొమ్మిది నెలలుగా ఇవ్వని వైనం
    • ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు
    • ఇళ్లకు చేరుకోవాలంటే దాతలు లేదా ప్రభుత్వం సహకరించాల్సిందే
    • వేతనాల చెల్లింపుపై నోరుమెదపని కంపెనీ యాజమాన్యాలు
    మోర్తాడ్‌: సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా మన ప్రాంత కార్మికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన సౌదీ కంపెనీలు కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. ఎనిమిది, తొమ్మిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా కంపెనీల యజమానులు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆరు నెలల కింద మూతబడిన బిన్‌లాడెన్‌కు చెందిన కంపెనీ అనేక మంది కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టగా ఓజర్‌ కంపెనీ కూడా అదే దారిలో నడిచింది. కొంత మంది కార్మికులకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోగా, మరి కొంత మంది కార్మికులకు ఎనిమది నెలల నుంచి వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు ప్రధాన కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు సైతం కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా రోడ్డున పడవేశాయి. సౌదీలోని పలు కంపెనీలు లాకౌట్‌ ప్రకటించడంతో వేలాది మంది కార్మికులు వీధినపడ్డారు. అకామా లేకుండా బయట తిరుగుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. రియాద్, జెద్దాలో ఉన్న ఔట్‌ జైళ్లతో పాటు, వివిధ నివాస ప్రాంతాల్లో ఉన్న మన దేశానికి చెందిన దాదాపు 7,800 మంది కార్మికులకు  కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లించాల్సి ఉంది. కంపెనీలు వేతనాలు ఎగవేయడంతో కార్మికులు తమ ఇంటికి చిల్లిగవ్వ కూడా పంపించలేక పోయారు. ఒక్కోసారి మూడు నెలలకు ఒకసారి వేతనాలు చెల్లించే కంపెనీలు ఇప్పుడు అసలే వేతనాలు చెల్లించని స్థితికి దిగజారాయి. అయితే కార్మికులు లేబర్‌ కోర్టును ఆశ్రయిస్తున్నా కంపెనీ యజమానుల తరపున వకల్తా పుచ్చుకున్న అధికారులు కార్మికులకు న్యాయం చేయడంలేదు. కన్‌స్ట్రక్షన్, ఆయిల్, షాపింగ్‌ మాల్స్‌ తదితర వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీల నిర్వాహకులు కార్మికుల పొట్టగొడుతున్నారు. సౌదీ ఔట్‌ జైలులోను, నివాస ప్రాంతాలలో ఉంటున్న కార్మికులను ఇండియాలోని వారి ఇళ్లకు చేర్చడానికి విదేశాంగ శాఖ ఔట్‌పాస్‌పోర్టులను జారీ చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే కార్మికులు మాత్రం సొంతంగా టిక్కెట్‌లను కొనుగోలు చేసుకుని ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. టిక్కెట్‌ కొనాలంటే మన కరెన్సీలో కనీసం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది. కంపెనీలు వేతనాలు ఎగ్గొట్టడంతో కార్మికుల చేతిలో నయాపైసా లేకుండా పోయింది. దీంతో కార్మికులు ఇళ్లకు చేరడానికి దాతల సహకారం లేదా, ప్రభుత్వమే విమాన చార్జీలను భరించడమో చేయాల్సి ఉంది. మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులను ఇళ్లకు చేర్పించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు. 

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement