సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం
ప్రభుత్వం రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య స్పష్టం చేశారు.
ఎంజీఎం : ప్రభుత్వం రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య స్పష్టం చేశారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 24 రోజులుగా ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాంట్రాక్టు ఏఎన్ఎంలను క్రమబద్ధీకరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మారుస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రెండో ఏఎన్ఎంలకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు సీఐటీయూ అనుబంధ సంఘాలు మద్దతు తెలుపుతూ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటామని చుక్కయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదానాయక్, సీఐటీయూ జిల్లా నేతలు రొయ్యల రాజు, చక్రపాణి, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
దీక్ష శిబిరంలో ఏఎన్ఎంల నిద్ర
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమంతో ఆందోళన చేపట్టిన రెండో ఏఎన్ఎం రాత్రి అక్కడే నిద్రించారు.