మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన వధూవరుల తల్లిదండ్రులు ఆంధ్రాబ్యాంకులో దాచుకున్న డబ్బు పెళ్లికోసం
పెళ్లిళ్లకు బ్యాంకుల మోకాలడ్డు
Dec 1 2016 3:02 AM | Updated on Sep 4 2017 9:32 PM
గజపతినగరం రూరల్: మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన వధూవరుల తల్లిదండ్రులు ఆంధ్రాబ్యాంకులో దాచుకున్న డబ్బు పెళ్లికోసం అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు వారు బ్యాంకు ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా చిల్లి గవ్వకూడా బ్యాంకు అధికారులు ఇవ్వక పోవడంతో పెళ్లి రద్దవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి దగ్గర పడుతోందని ఉన్న భూములను అమ్ముకొని బయట కొంత అప్పు చేసి బ్యాంకులో దాచుకున్న నగదును పెళ్లి సమయానికి తీసుకుందామనుకుంటే ఇప్పుడు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ముచ్చర్ల గ్రామానికి చెందిన వధువు ఉత్తర వివాహం డిసెంబర్ ఒకటో తేదీన జరగాల్సి ఉన్నా డబ్బు ఇవ్వలేదని ఆమె తల్లి దండ్రులు గేదెల రమణ, గేదెల కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
అదే గ్రామానికి చెందిన మరో పెళ్లి ఈ నెల 9వ తేదీన జరుగుతున్నందున బ్యాంకులో నగదును తీసుకోవడానికి వారం రోజులుగా క్యూలో నిలుస్తున్నా డబ్బు అందడం లేదని మరో వధువు సుజాత తల్లి దండ్రులు మీసాల సూరప్పడు, అన్నాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బ్యాంకు మేనేజర్ సీతారామును ప్రశ్నించగా రోజుకు నాలుగునుంచి ఐదు లక్షలు వస్తోందనీ ఆ మేరకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెళ్లిళ్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement