నాకుండేదే క్యారెక్టర్ | I have only Character itself | Sakshi
Sakshi News home page

నాకుండేదే క్యారెక్టర్

Feb 26 2016 3:03 AM | Updated on Aug 14 2018 11:26 AM

కాపు రుణమేళా సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - Sakshi

కాపు రుణమేళా సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

‘‘నాకుండేదే క్యారెక్టర్. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను. రాజకీయాల్లో విలువల కోసమే పాటుపడుతున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

కాపు రుణమేళా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘నాకుండేదే క్యారెక్టర్. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను. రాజకీయాల్లో విలువల కోసమే పాటుపడుతున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గురువారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల రుణమేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి కింద పలువురు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. విద్వేషాలను రెచ్చగొట్టి, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 కాపు రిజర్వేషన్ల బాధ్యత నాదే
 కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి కాపు యువతకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని, కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. వెనుకబడిన కులాలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేదలను కూడా ఆదుకుంటామన్నారు.

 ఆక్వా పార్కు వల్ల నష్టం లేదు
 పరిశ్రమలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని, పరిశ్రమలు కావాలంటే భూములు ఇవ్వాలని చంద్రబాబు రైతులకు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర తీరంలో నెలకొల్పుతున్న ఆక్వా పార్కు వల్ల నష్టం లేదనీ, వ్యర్థాలను సముద్రంలోకి వదులుతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement