రూ.1.30 లక్షలకు అమ్మేశాడు | boy@1.30 lakhs | Sakshi
Sakshi News home page

రూ.1.30 లక్షలకు అమ్మేశాడు

Jun 15 2016 8:53 AM | Updated on Sep 4 2017 2:33 AM

జల్సాల కోసం కుమారుడినే అమ్మేశాడు ఓ తండ్రి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో భయపడి ఫోన్‌ద్వారా వివరాలు తెలిపాడు.

  •  రూ.1.30లక్షలకు విక్రయం
  •  పసికందును తల్లి ఒడి చేర్చిన పోలీసులు
  •  నంద్యాలలో ఘటన
  •  
    నంద్యాల:  జల్సాల కోసం కుమారుడినే అమ్మేశాడు ఓ తండ్రి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో భయపడి ఫోన్‌ద్వారా వివరాలు తెలిపాడు. ఎట్టకేలకు శిశువును తల్లి ఒడి చేర్చారు పోలీసులు. ఈ ఘటన మంగళవారం నంద్యాల పట్టణంలో సంచలనం రేపింది. మహానంది మండలం గాజులపల్లె మెట్ట ప్రాంతానికి చెందిన హుసేన్‌బీకి శిరివెళ్లలో గౌండ పని చేసే అబ్దుల్ వహీద్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం వీరికి నాగూర్‌షరీఫ్ అనే మగబిడ్డ జన్మించారు.
     
     కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిన అబ్దుల్ వహీద్..మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. డబ్బుల కోసం కన్న కుమారుడినే అమ్మేయాలని తలంచాడు. ఈ క్రమంలో  నాలుగు రోజుల క్రితం గాజులపల్లె మెట్టలో ఉన్న భార్య హుసేన్‌బీని అయ్యలూరు మెట్ట వరకు రావాలని ఫోన్ చేశాడు. తర్వాత ఆయన కూడా శిరివెళ్ల నుంచి అయ్యలూరు మెట్టకు చేరుకున్నాడు. అక్కడి నుంచి నూనెపల్లె రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. తనకు కుమారుడు నాగూర్‌షరీఫ్‌ను ఎత్తుకొని వెళ్లి ఇక్కడే వేచి ఉన్న వైఎస్‌నగర్‌కు చెందిన జబ్బార్‌కు చూపించాడు.
     
     తర్వాత భార్యతోపాటు జగజ్జననీ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమారుడు నాగూర్‌షరీఫ్‌ను ఎత్తుకొని బయటకు వచ్చిన వహీద్.. రూ.1.30లక్షలకు జబ్బార్‌కు విక్రయించారు. తర్వాత భార్యకు మాయమాటలు చెప్పి నూనెపల్లెలోని ఏకలవ్యనగర్‌కు తీసుకొని వెళ్లారు. కుమారుడు కావాలని హుసేన్‌బీ, ఆమె బంధువులు ఒత్తిడి చేయడంతో పరారయ్యాడు. తర్వాత హుసేన్‌బీ, ఆమె బంధువులు నాగూర్‌షరీఫ్ కోసం గాలింపులు ప్రారంభించారు. ఫలితం లేకపోవడంతో త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
     
     ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్‌వహీద్ బంధువులకు ఫోన్ చేసి తాను బిడ్డను వైఎస్‌నగర్‌లోని జబ్బార్‌కు విక్రయించానని, వాపస్ తెచ్చుకోవాలని చిరునామా, సెల్ నంబర్ అందించారు. పోలీసులు జబ్బార్ ఇంటికి వెళ్లి..పసిబ్డిను సురక్షితంగా తల్లి  హుసేన్‌బీకి అప్పగించారు. అయితే నిందితులు ఇద్దరు అబ్దుల్ వహీద్, జబ్బార్‌లు పరారీలో ఉన్నారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement