బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ | another quest in vijayawada government hospital child missing case | Sakshi
Sakshi News home page

బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ

Jul 15 2016 7:37 PM | Updated on Jun 4 2019 6:34 PM

బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ - Sakshi

బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ

బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల పసికందు అదృశ్యం కేసులో పోలీసులకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎదురవుతున్నాయి.

విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల పసికందు అదృశ్యం కేసులో పోలీసులకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. నెహ్రూ బస్టాండ్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బాబు అదృశ్యానికి సంబంధించిన అనుమానితుల దృశ్యాలను పోలీసులు హడావుడిగా విడుదల చేశారు. దీంతో ఆ దృశ్యాల్లో ఉన్న మహిళ శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో కంగుతిన్నారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు.

గుంటూరుకు చెందిన ధాన్యశబరి అనే మహిళ శుక్రవారం విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. బాబు కిడ్నాప్తో మాకెలాంటి సంబంధం లేదని... ఫిబ్రవరి 27న గుంటూరు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చానని చెప్పారు. నిందితులను నిర్థారించుకోకుండా పోలీసులు ఫోటోలను ఏ విధంగా విడుదల చేస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరువు గల కుటుంబాన్ని రోడ్డుకీడ్చారని, సంబంధిత పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ధాన్యశబరి డిమాండ్ చేశారు.  

ధాన్యశబరి వాదనతో పోలీసులు విభేదిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వారు, పోలీసులను ఆశ్రయించిన వారు ఒక్కరు కాదని పోలీసులు చెబుతున్నారు. గురువారం విడుదల దృశ్యాలకు కట్టుబడి ఉన్నామని.. ఆ దృశ్యాల్లో ఉన్న వారే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని చెబుతున్నారు. గుంటూరుకు చెందిన మహిళలు మీడియా ముందుకు వచ్చిన వారు ఎందుకు వచ్చారో తెలియదంటున్నారు. బాబు ఆచూకీ కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదృశ్యమైన చిన్నారి బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాబు అదృశ్యం కేసులో నిందితులను పట్టుకోక పోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement