ఏమైందో ఏమో?

Young Man Commits Suicide in Prakasam After Conflicts With Bride - Sakshi

ప్రకాశం ,చీమకుర్తి: ఆ జంటకు ఇటీవల నిశ్చితార్థమైంది. పెళ్లి చేసుకోవడమే తరువాయి. చీమకుర్తి నుంచి సోనూరాజ్‌.. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ నుంచి అతనికి కాబోయే భార్య ఫోన్‌లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య ఏమైందో ఏమో.. తాను చనిపోతున్నానని సోనూరాజ్‌ తనకు కాబోయే భార్యకు మెసేజ్‌ పెట్టాడు. రామతీర్థంలోని గ్రానైట్‌ క్వారీలో పనిచేస్తున్న సోనూరాజ్‌ తమ్ముడికి ఆమె ఫోన్‌ చేసి మీ అన్నయ్య ఇంట్లో ఉరేసుకొని చనిపోబోతున్నాడని, వెంటనే వెళ్లి కాపాడని ఏడుస్తూ చెప్పింది. హుటాహుటిన సూరజ్‌రాజ్‌ తన అన్న సోనూరాజ్‌ను కాపాడుకునేందుకు వచ్చి ఇంటి తలుపులు తట్టాడు. అప్పటికే సోనూరాజ్‌ (25) ఇంట్లో సీలింగ్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం చీమకుర్తిలోని కొత్తపేట బజారులో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీకి చెందిన సోనూరాజ్, అతని తమ్ముడు సూరజ్‌రాజ్‌ చీమకుర్తిలోని గ్రానైట్‌ క్వారీల్లో ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. తనతో నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో సోనూరాజ్‌ ఫోన్‌లో మాట్లాడాడు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ ఫోన్‌ పెట్టేశాక ఆమెకు మెసేజ్‌ పెట్టాడు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాన్నది ఆ మెసేజ్‌ సారాంశం. కంగారు పడిన ఆమె వెంటనే చీమకుర్తిలోనే ఉన్న అతడి తమ్ముడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అతడు హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా తన అన్న ఉరికి నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. క్షణంలో ఉరేసుకొని సోనూరాజ్‌ ఆత్మహత్య చేసుకోవడాన్ని తమ్ముడు సూరజ్‌రాజ్, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ పి.నాగశివారెడ్డి పరిశీలించారు. సూరజ్‌రాజు ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ మాల్యాద్రి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top