మహిళను మోసం చేసిన యువకుడు | The Young Man Cheated The Woman | Sakshi
Sakshi News home page

 గోల్డ్‌లోన్‌ ఇప్పిస్తానని మోసం

Mar 28 2018 11:15 AM | Updated on Aug 11 2018 6:04 PM

The Young Man Cheated The Woman - Sakshi

సీసీ కెమెరాలో నమోదైన నిందుతుడి చిత్రం 

జోగిపేట(అందోల్‌): బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుందామని బ్యాంకుకు వచ్చిన మహిళను బోల్తా కొట్టించి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం జోగిపేట ఆంధ్రాబ్యాంకు వద్ద జరిగింది. టేక్మాల్‌ మండలం దాదాయపల్లికి చెందిన నాగమ్మ బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుందామని జోగిపేట ఆంధ్రాబ్యాంకుకు దూరపు బంధువు శ్రీశైలంతో కలిసి వచ్చింది. బంగారంపై లోన్‌ ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరగా బంగారం తూకం వేసే వ్యక్తి వస్తాడని, ఫోన్‌ నంబర్‌ ఇచ్చి అతనికి ఫోన్‌ చేయాలని సూచించారు. శ్రీశైలం అతడికి ఫోన్‌ చేయగా..అరగంట తర్వాత వస్తానని చెప్పాడు. ఇది గమనించి ఒక వ్యక్తి శ్రీశైలం, నాగమ్మ వద్దకు వెళ్లి  బంగారం లోన్‌  కోసం ఫోన్‌చేసింది మీరేనా? ఎన్ని తులాలు ఉంది? అని ప్రశ్నించాడు. రెండు తులాలు ఉందని, రూ.30వేలు లోన్‌ కావాలని బాధితులు చెప్పారు. గొలుసు రెండు తులాలు ఉందోలేదో చూస్తానని, ఈ లోగా పట్టా పాస్‌ బుక్‌ జిరాక్స్‌ తీసుకురా అని శ్రీశైలంను అక్కడి నుంచి పంపించాడు. మహిళను బ్యాంకు ముందు కూర్చోపెట్టి బంగారంతో లోపలికి వెళ్లిన మోసగాడు కనిపించకుండా బయటకు వెళ్లిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాకపోయే సరికి శ్రీశైలం, నాగమ్మలు బ్యాంకులో వెతికి, కనిపించకపోయే సరికి బోరున విలపించారు. 
ఫుటేజీల ఆధారంగా నిందుతుడి గుర్తింపు..
సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకులోని సీసీ కెమరాల ఫుటేజీని పరిశీలించారు. రెడ్‌ షర్ట్‌ వేసుకున్న వ్యక్తే తమను మోసం చేశాడని బాధితులు గుర్తించారు. ఫోటోలో ఉన్న వ్యక్తి సుమారుగా 25 ఏళ్ల వయస్సు ఉండవచ్చునని, ఎవరికైనా అతడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ రమణ సూచించారు. దొంగను పట్టించిన వారికి పారితోషకం ఇస్తామన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement