భర్త చేతిలో లైంగిక దాడికి గురైన వివాహిత మృతి | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో లైంగిక దాడికి గురైన వివాహిత మృతి

Published Wed, Apr 24 2019 8:20 PM

Woman dies in coma after being sexually assaulted by husband in chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : భర్త చేతిలో లైంగిక దాడికి గురైన పద్మ (32) బుధవారం మృతి చెందారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట ఆమెపై భర్త నంద లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బిడ్డకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్న సమయంలో తన లైంగిక వాంఛ తీర్చాలంటూ పద్మను నంద తీవ్రంగా వేధించడం.. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆస్పత్రి మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించడం తెలిసిందే.

ఈ ఘటనలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రక్తస్రావం ఎక్కువయ్యి పద్మ కోమాలోకి వెళ్లిపోయింది. గత మూడు రోజులుగా ఐసీయూలో పద్మను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పద్మను చంపడానికి ఆమె చీరతోనే గొంతుకు బిగించడంతో మెదడుకు రక్త సరఫరా అయ్యే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హత్య కేసు కూడా నమోదు చేశారు.

Advertisement
Advertisement